ఆ మూడు పార్టీల కలయిక ప్రజాతీర్పునకు వ్యతిరేకం: సుప్రీంను ఆశ్రయించిన బీజేపీ కార్యకర్త
ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కూటమి సహేతుకమైనది కాదని అది ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని పేర్కొంటూ మహారాష్ట్రలోని బీజేపీ కార్యకర్త సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ ఏర్పాటుపై మూడుపార్టీలు కీలక ప్రకటన చేయనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడం చర్చనీయాంశమైంది.
మూడు పార్టీలది అపవిత్ర కలయిక
మహారాష్ట్ర బీజేపీ కార్యకర్త సురేంద్ర బహదూర్ సింగ్ మూడుపార్టీలది అపవిత్రమైన కలయిక అంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ను దాఖలు చేశాడు. ఎన్నికలకంటే ముందే పొత్తు పెట్టుకుని కలిసి పోటీచేసిన బీజేపీ శివసేన పార్టీలకు ప్రజలు ఆమోదం తెలిపారని మెజార్టీ సీట్లు అందించారని పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ మూడు పార్టీల అపవిత్ర కలయికతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని దీన్ని వెంటనే ఆపాలంటూ సురేంద్రసింగ్ పేర్కొన్నాడు. మూడు పార్టీలు ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు పోటీ చేశారని ఇప్పుడు అదే మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయని పిటిషన్లో పేర్కొన్నాడు. ఇలా చేయడం ఎన్నికల తీర్పునకు విరుద్ధమని చెప్పుకొచ్చాడు.
ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ఆదేశాలు ఇవ్వండి
ప్రభుత్వం ఏర్పాటు కాకుండా చూసేలా గవర్నర్కు ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ సర్వోన్నత న్యాయస్థానంను కోరాడు. ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పాటు అయితే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుందని అలాంటి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని కోరాడు. ఎన్సీపీ-కాంగ్రెస్లకు వ్యతిరేకంగా బీజేపీ-శివసేన పార్టీలు పోటీచేశాయని అలాంటప్పుడు ఈ మూడు పార్టీలు తిరగి ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తాయని పిటిషనర్ ప్రశ్నించారు.
మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది
ఒక పార్టీకి వ్యతిరేకంగా పోటీచేసిన శివసేన పార్టీ తిరిగి అదే పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానిస్తున్నట్లే అని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అదేసమయంలో రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించినట్లే అవుతుందని తన పిటిషన్లో తెలిపారు. ఒక పార్టీ మరొక పార్టీకి వ్యతిరేకంగా పోటీచేసి, ఆ పార్టీ ఇతర పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, మేనిఫెస్టోలను వ్యతిరేకిస్తూ పోటీచేసి ఆ తర్వాత అదే పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయిందంటూ సురేంద్ర బహదూర్ సింగ్ తెలిపారు.