ఢిల్లీతో ఢీ: అఖిలపక్ష సమావేశం: ఆ రెండు పార్టీలను దూరం పెట్టిన స్టాలిన్ !
తమిళనాడు రైతులకు మద్దతుగా ఢిల్లీతో ఢీకొనడానికి అందరూ కలిసి రావాలంటూ అఖిల పక్ష సమావేశానికి డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ పిలుపునిచ్చారు.
చెన్నై: తమిళనాడు రైతులకు మద్దతుగా అఖిల పక్ష సమావేశానికి డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ పిలుపునిచ్చారు. తమిళనాడు ప్రభుత్వం స్పందించడంలేదని, అందు వలన ప్రతిపక్షాలు స్పందించాలని ఆయన అన్నీ పార్టీలకు ఆహ్వానాలు పంపించారు.
ఈనెల 16వ తేదీ ఆదివారం చెన్నైలోని అన్నా ఆరివాలయంలో జరిగే అఖిలపక్ష సమావేశానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. కరువుతో తల్లడిల్లుతున్న అన్నదాతను ఆదుకోవాలంటూ చేతులచాచి అర్జించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని ఎంకే. స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. రైతులు రోడ్డెక్కి పోరాటం చేస్తున్నా ఆదుకునే వారు కరువయ్యారని చెప్పారు.
ప్రభుత్వానికి పట్టలేదు
రైతుల ఆందోళనలు తనకు ఏమీ పట్టనట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి వ్యవహరిస్తున్నారని అందుకే ప్రతిక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ రంగంలోకి దిగుతున్నారని డీఎంకే పార్టీ నాయకులు అంటున్నారు.
ఢిల్లీతోనే ఫైట్
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం తప్పా అన్ని పార్టీల నాయకులు తమిళనాడు రైతులకు మద్దతు ఇస్తున్నారని స్టాలిన్ అంటున్నారు. అయితే బీజేపీ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అందుకే ప్రతిపక్షాలను ఏకం చేసి కేంద్ర ప్రభుత్వంతో ఢీకొడతామని స్టాలిన్ హెచ్చరించారు.
ప్రతిపక్షాలు కదలి వస్తాయా ?
డీఎంకే పిలుపుకు ప్రతిపక్ష పార్టీలు కదిలేనా అన్న ప్రశ్న బయలుదేరింది. ఇది వరకు తమిళనాడు జాలర్ల సమస్యలపైనా, హైడ్రో కార్బన్ తవ్వకాలకు వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశాలకు డీఎంకే పిలుపునిచ్చింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదు.
రైతు సమస్యలు కాబట్టి
రైతు సమస్యలు కావడంతో ప్రతిపక్షాలు అన్నీ ఒక్కటి అవుతాయా ? అనే విషయం వేచిచూడాలి. ఇప్పటికే రైతులకు మద్దతుగా అన్ని పార్టీలు వేర్వేరుగా పయనం సాగిస్తున్నాయి. ఇప్పుడు డీఎంకే పార్టీ అఖిలపక్షానికి పిలుపునివ్వడంతో ఏ మేరకు స్పందిస్తాయో వేచిచూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
రెండు పార్టీలకు నో చెప్పిన స్టాలిన్
తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అఖిల పక్ష సమావేశానికి దూరం పెట్టామని, వారిని ఆహ్వానించలేదని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు.