3 కమిటీలకు బెనివాల్ గుడ్ బై: రైతులకు మద్దతుగా.. మరో కారణం కూడా.. ఎన్డీఏ నుంచి
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఆందోళన కొనసాగుతూనే ఉంది. అయితే వీరికి నేతల మద్దతు కూడా కంటిన్యూ అవుతోంది. రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీకి చెందిన ఎంపీ, బీజేపీ మిత్రపక్షం హనుమాన్ బెనివాల్ మూడు పార్లమెంటరీ కమిటీ పదవులకు రాజీనామా చేశారు. రైతుల ఆందోళనకు మద్దతుగా రాజీనామా చేసినట్టు ఆయన వివరించారు. ఈ మేరకు ఆయన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ కూడా రాశారు.
రైతుల నిరసనకు మద్దతు తెలుపడంతోపాటు.. ఆయా కమిటీల్లో సభ్యుడిగా ఉన్నానని.. పలు అంశాలను ప్రస్తావిస్తే పరిష్కరించలేదని చెప్పారు. ఇదీ కూడా తనకు మనస్తాపం కలిగించిందని వివరించారు. లోక్సభ కమిటీ సిఫారసులో జోక్యం చేసుకునేందుకు అవకాశం ఉన్న.. చర్యలు తీసుకోకుంటే ఎందుకు అని అడిగారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యవస్థల నిర్మాణాల ప్రాముఖ్యం కోల్పోతుందని లేఖలో తెలిపారు.
రాజస్తాన్లోని నాగూర్ లోక్ సభ నుంచి హనుమాన్ బెనివాల్ ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీస్, పెట్రోలియం, సహజ వాయువు, పిటిషన్ కమిటీల్లో బెనివాల్ సభ్యుడిగా ఉన్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకొని.. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని బెనివాల్ కోరుతున్నారు. రైతుల డిమాండ్లను నెరవేర్చకుంటే ఎన్డీఏను విడిచిపెడతానని ఇదివరకే హెచ్చరించారు. ఆ మేరకు తొలుత కమిటీల నుంచి వైదొలిగారు.