బీజేపీకి షాకిచ్చిన మిత్రపార్టీ.. ఢిల్లీలో ఎల్జేపీ ఒంటరిపోరు.. జార్ఖండ్ సీన్ రిపీట్..
రసవత్తరంగా సాగుతోన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చాలా ఏళ్లుగా బీజేపీకి మిత్రపార్టీగా కొనసాగుతోన్న లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) ఢిల్లీలో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎల్జేపీ ఢిల్లీ యూనిట్ చీఫ్ కాళీ పాండే మంగళవారం 15 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశారు.
బీజేపీ పిలవనందుకే..
బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలోని పార్టీల మధ్య కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ లాంటిదేదీ లేకపోవడంతో అవసరానికి తగ్గట్లు కలవడం, విడిపోవడం జరుగుతూఉంటుంది. ఇదే అంశాన్ని ప్రస్తావించిన కాళీ పాండే.. బీజేపీతో ఎల్జేపీ పొత్తు బిహార్ వరకే పరిమితమని, ఢిల్లీలో సత్తాచాటుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. కూటమిలో పెద్ద పార్టీగా బీజేపీనే చొరవతీసుకుని మిత్రుల్ని పిలవాల్సి ఉంటుందని, ఇప్పటిదాకా ఎలాంటి ఆహ్వానం రాకపోవడం వల్లే ఒంటరి పోరుకు రెడీ అయ్యామని ఆయన చెప్పారు.
జార్ఖండ్ లో జరిగిందే ఢిల్లీలోనూ..
మిత్రులను కలుపుకొనిపోయే విషయంలో బీజేపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని, జార్ఖండ్ లో ఎల్జేపీని, ఆల్ జార్ఖండ్ స్డూడెంట్ యూనియన్ పార్టీని పక్కనపెట్టడం వల్లే బీజేపీ ఓటమిపాలైందని పాండే వివరించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జార్ఖండ్ సీన్ రిపీటైతే.. ఆ నేరం బీజేపీదే తప్ప ఎల్జేపీది కాబోదని అన్నారు.
బీహారీల ఓట్లు చీల్చేందుకే?
ఎల్జేపీ వ్యవస్థాపకుడు రాంవిలాస్ పాశ్వాన్ ప్రస్తుతం మోడీ కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన కొడుకు చిరాగ్ పాశ్వాన్ ఇటీవలే పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ పదవి చేపట్టారు. బీహార్ కేంద్రంగా పనిచేస్తోన్న ఎల్జేపీ.. చాలా కాలంగా బీజేపీతో అంటకాగుతోంది. జార్ఖండ్ లో చెప్పుకోదగ్గ బలం లేదుకాబట్టి ఎల్జేపీని పక్కనపెట్టేసిన బీజేపీ.. ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం దాన్నొక అవకాశంగా వాడుకోవాలని చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఢిల్లీలో పెద్ద సంఖ్యలో ఉన్న బిహారీల ఓట్లను చీల్చేందుకే ఎల్జేపీతో ఒంటరిపోరు చేయిస్తోందనే విశ్లేషణలు వస్తున్నాయి. ఎల్జేపీ ఒంటరిపోరు ప్రకటనపై బీజేపీ ఇంకా స్పందించలేదు.