సోనియా తెల్లతోలు: ఆ భాష సరికాదని తప్పుపట్టిన కేంద్రమంత్రి
పాట్నా: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్ సింగ్ పైన ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లోని ఓ కేంద్రమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి ఉపేంద్ర కుష్వహ్ గురువారం మాట్లాడుతూ... ఓ కేంద్రమంత్రి ఇలాంటి భాష వాడవద్దన్నారు. కేంద్రమంత్రిగా ఉండి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయవద్దన్నారు.
గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలను ఖండించిన ఉపేంద్ర కుష్వహ్ రాష్ట్రీయ లోక్ సమంత పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) అధినేత. ఈ పార్టీ ఎన్డీయేలో భాగస్వామి. కుష్వాహ్ మాట్లాడుతూ... ఇలాంటి వ్యాఖ్యలను తమ పార్టీ సమర్థించదని చెప్పారు. గిరిరాజ్ తన వ్యాఖ్యలకు రాజీనామా చేయాలా అని ప్రశ్నించగా... దానిపై వ్యాఖ్యానించలేమని చెప్పారు. ఇది బీజేపీ నిర్ణయమన్నారు.
మరోవైపు, బీజేపీ దీనిపై మాట్లాడుతూ.. గిరిరాజ్ తన వ్యాఖ్యల పైన పశ్చాత్తాపం ప్రకటించారని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలన్నారు.
గిరిరాజ్ పైన కేసు నమోదు చేయండి: కోర్టు
సోనియా పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్ సింగ్ పైన కేసు నమోదు చేయాలని బీహార్ లోని ముజఫర్ పూర్ న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. సోనియాది తెల్లతోలు అయినందునే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ అంగీకరించిందని, రాజీవ్ గాంధీ నైజీరియా మహిళను చేసుకుంటే అంగీకరించి ఉండేవారు కాదని వ్యాఖ్యానించారు.