అబ్ కాశ్మీర్ హమారా: కన్యాకుమారి వరకు నినదిస్తోన్న భారత్
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తితో కూడిన రాష్ట్ర హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. కాశ్మీర్ హమారా అంటూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశ ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ప్రత్యేకించి- భారతీయ జనతాపార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ కార్యాలయాల వద్ద పండగ వాతావరణం నెలకొంది. పార్టీ నాయకులు బాణాసంచా కాల్చుతున్నారు. స్వీట్లను పంచుతూ, తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక 2024 లోనూ తామే అధికారంలో వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల జోడీనిని అత్యంత శక్తిమంతమైన నేతలుగా కీర్తిస్తున్నారు.
పండగ వాతావరణం..
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం, అదే సమయంలో ఆ రాష్ట్రాన్ని విభజించి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం ఉదయం రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే ఆలస్యం.. దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు సంబరాలకు దిగిపోయారు. తమ పార్టీ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున గుమి కూడారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తారంటూ వార్తలు బయటికి పొక్కిన నేపథ్యంలో- నాయకులందరూ ఉదయమే పార్టీ కార్యాలయాలకు చేరుకున్నారు. టీవీలకు అతుక్కుపోయారు. ఈ ఉదయం అమిత్ షా రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వెంటనే ఇక ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సంబరాలకు తెర తీశారు.
మిన్నంటిన సంబరాలు..
బీజేపీ సహా ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలైన శివసేన, జనతాదళ్ (యునైటెడ్), అకాలీదళ్, అఖిల భారత అన్నాడీఎంకే వంటి పార్టీల నాయకులు, కార్యకర్తలు రోడ్ల మీదికి వచ్చారు. తమ వాహనాలకు పార్టీల జెండాలను కట్టి విజయోత్సవ ర్యాలీలను నిర్వహించారు. బీజేపీ బలంగా ఉన్న బిహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, కర్ణాటక, తమిళనాడు, అసోం వంటి రాష్ట్రాల్లో సంబరాలు మిన్నంటాయి. నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు. స్వీట్లను పంచుకుని తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకున్నారు. బెంగళూరు, పాట్నా, జైపూర్, ముంబై, పుణే వంటి నగరాల్లో బీజేపీ కార్యకర్తలు రోడ్ల మీద వచ్చీ, పోయే వారిని ఆపి మరీ వారి చేతుల్లో స్వీట్లను పెట్టడం కనిపించింది.
ఒకే దేశం..ఒకే జెండా..
ఈ సందర్భంగా పార్టీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. ఒకే దేశంలో ఇద్దరు ప్రధానమంత్రులు, రెండు విధానాలు, రెండు జెండాలు ఉండకూడదనేది శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రాథమిక సిద్ధాంతం. దీనికి అనుగుణంగా నరేంద్ర మోడీ-అమిత్ షాల జోడి పని చేసిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒక్క మంత్రంతో దేశ సమగ్రత కోసం తన జీవితాన్ని సైతం త్యజించిన జాతీయవాది శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలలు నేటి నిజమయ్యాయని అన్నారు. ఆయన త్యాగానికి ప్రతిఫలం దక్కిందని చెప్పారు. జమ్మూ-కశ్మీర్ పునర్విభజన చేస్తూ కేంద్రం కీలకమైన సవరణ ప్రకటించడం సాహసోపేత నిర్ణయమని కితాబిచ్చారు. జమ్మూకశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజన చేయడం వల్ల ఉగ్రవాదం మటుమాయం అవుతుందని చెప్పారు. బలమైన భారత్ నిర్మాణం బీజేపీకే సాధ్యం అని మరోసారి నిరూపితమైందని అన్నారు. భారత దేశ చరిత్రలోనే ఓ అద్భుత, చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి ఆవిష్కరించారని ప్రశంసించారు.
మోడీ-అమిత్ షా జోడీ.. శక్తిమంతం
ప్రధాని నరేంద్ర మోడీ-హోం మంత్రి అమిత్ షా జోడీ అత్యంత శక్తిమంతమైనదని పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. వారిద్దరూ తలచుకుంటే ఎలాంటి కార్యాన్నయినా సాధించగలరని చెబుతున్నారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ పరిపాలనా వ్యవహారాలు కేంద్రం చేతుల్లోకి వచ్చాయని, ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై వారిద్దరూ దృష్టి పెట్టారని అంటున్నారు. త్వరలోనే అఖండ భారత్ ను చూడగలుగుతామని ఆశాభావాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.