32 అసెంబ్లీ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థులు వీరే
దేశవ్యాప్తంగా 32 చోట్ల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది. ఆయా చోట్ల తమ అభ్యర్థులను కాసేపటి క్రితం ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, సిక్కిం, బీహర్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, రాజ్థస్థాన్, తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
ఆమోద ముద్ర
ఆయా అభ్యర్థులను బీజేపీ కేంద్ర కమిటీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. యూపీలోని 10 స్థానాలు, కేరళలో 5, అసోంలో 4, హిమచల్ ప్రదేశ్, పంజాబ్, సిక్కిం 2, బీహర్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ మేఘాలయ, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. వచ్చేనెల 21న మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలోపాటు 51 స్థానాలకు ఉప ఎన్నికలను ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఇప్పటికే 32 అభ్యర్థులతో జాబితాను బీజేపీ హైకమాండ్ విడుదల చేసింది. మిగతా 19 మందిని తర్వాత విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చింది.
2014లో విడిగా
మరోవైపు మహారాష్ట్రలో బీజేపీ-శివసేన పొత్తులు ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగింది. కానీ 2014లో మాత్రం ఒంటరిగా బరిలోకి దిగాయి. తర్వాత పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులకు టికెట్లు ఇవ్వబోమని బీజేపీ హైకమాండ్ తేల్చిచెప్పింది. కానీ హర్యానాలో కేంద్రమంత్రి రావు ఇంద్రిజిత్ సింగ్ తన కూతురి కోసం టికెట్ అడుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
టికెట్ అడగొద్దు
మరోవైపు 75 ఏళ్లు దాటినవారికి పార్టీ టికెట్ ఇవ్వబోమని ఇప్పటికే బీజేపీ పార్లమెంటరీ పార్టీ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. బీజేపీ పార్టీ విశ్వసనీయ వర్గాల నుంచి తెలిసిన సమాచారం ప్రకారం.. మహారాష్ట్ర, హర్యానాలో కొందరు సిట్టింగులకు సీటు దక్కకపోవచ్చని తెలుస్తోంది. కొత్తగా మాజీ ఇండియా హాకీ కెప్టెన్ సందీప్ సింగ్, ఒలింపిక్ రెజ్లర్ యోగేశ్వర్ దత్, మహిళా రెజ్లర్ బబితా ఫోగట్ ఇటీవలే బీజేపీలో చేరారు. వీరికి తప్పకుండా బీజేపీ టికెట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.