తమిళనాడు ఎన్నికల ఇంఛార్జీగా కిషన్ రెడ్డి, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలకూ ఇంఛార్జీలు
న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఇంఛార్జీలను, సహ ఇంఛార్జీలను నియమించింది. పలువురు కేంద్రమంత్రులు, కీలక నేతలకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీజేపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
తమిళనాడు ఎన్నికల ఇంఛార్జీగా హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని, సహ ఇంఛార్జీగా కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్ను నియమించింది. అస్సాం ఇంఛార్జీగా కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, సహా ఇంఛార్జీగా జితేంద్ర సింగ్, కేరళ రాష్ట్రానికి ఇంఛార్జీగా ప్రహ్లాద్ జోషి, సహ ఇంఛార్జీగా కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్ నియమితులయ్యారు.
ఇక పుదుచ్చేరికి కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘావల్, సహ ఇంఛార్జీగా ఎంపీ రాజీవ్ చంద్రశేఖరన్ ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.
Recommended Video
ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పశ్చిమబెంగాల్ రాష్ట్రంతోపాటు ఈ నాలుగు రాష్ట్రాలపైనా బీజేపీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. తమిళనాడు రాష్ట్రంలో అధికార అన్నాడీఎంకే పార్టీతో కలిసి బీజేపీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ జైలు నుంచి విడుదల కావడంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.