ఓడిన 4 నెలలకు బీజేపీలో బిగ్ ఛేంజ్.. తివారి ఔట్.. గుప్తా ఇన్.. మూడు రాష్ట్రాలకు కొత్త సారధులు
ఒకవైపు కరోనా విలయం కొనసాగుతున్నా.. జూన్ 1 నుంచి అన్ లాక్ 1.0 అమలులోకి రావడంతో దేశవ్యాప్తంగా రాజకీయ కలాపాలూ ఊపందుకున్నాయి. అందరికంటే ముందు అధికార బీజేపీ సంస్థాగతంగా తీసుకున్న కీలక నిర్ణయాలను మంగళవారం వెల్లడించింది. దేశరాజధాని ఢిల్లీ సహా మొత్తం మూడు రాష్ట్రాలకు కొత్త సారధులను నియమించింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారీ ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో చావుదెబ్బ తిన్న 4 నెలల తర్వాత బీజేపీ.. ఆ రాష్ట్ర అధ్యక్షుణ్ణి మార్చేసింది. మూడున్నర సంవత్సరాలుగా ఆ పదవిలో కొనసాగుతోన్న మనోజ్ తివారిని తొలిగిస్తూ, కొత్త చీఫ్ గా ఆదేశ్ కుమార్ గుప్తాను నియమించింది. అలాగే, ఛత్తీస్ గఢ్ పార్టీ బాధ్యతలను కేంద్ర మాజీ మంత్రి విష్ణుదేవ్ సాయికి, మణిపూర్ లో సారధ్యాన్ని తికేంద్ర సింగ్కు అప్పగించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నో ఏళ్లుగా పార్టీనే నమ్ముకున్న తన లాంటి సామాన్య కార్యకర్తకు ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి, నడ్డాకు ధన్యవాదాలు చెబుతున్నట్లు ఆకాశ్ గుప్తా ప్రకటన చేశారు. తన పదవీ కాలంలో పార్టీని ముందుకు నడిపానని, కొత్త చీఫ్ గుప్తా కూడా విజయం సాధిస్తారని మనోజ్ తివారి పేర్కొన్నారు. నిజానికి తివారి ఎన్నికల ఫలితాలప్పుడే రాజీనామా చేసినా, అప్పుడు వారించిన హైకమాండ్.. ఇప్పుడు మార్పు చేపట్టింది.
కాంట్రాక్టర్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆకాశ్ గుప్తా.. బీజేపీలో క్రమంగా ఎదుగుతూ, ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గానూ అవకాశం పొందారు. ప్రస్తుత కరోనా కాలంలో పేదలను ఆదుకోవడం, కార్యకర్తల్లో భరోసా నింపడం తన ప్రాధాన్యమన్న గుప్తా.. 2022లో జరిగే కార్పొరేషన్ ఎన్నికలపైనా ఫోకస్ పెడతామన్నారు. పార్టీ ప్రముఖులంతా గుప్తాకు విషెస్ తెలిపారు.