ముగ్గురు మాజీ సీఎంలకు బీజేపీ కీలక పదవులు, ఉత్తర్వులు జారీ చేసిన అమిత్ షా
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలి వరకు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో ముఖ్యమంత్రులగా పని చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే, రమణ్ సింగ్లకు పోస్టులు కట్టబెట్టింది.
పార్టీ అధిష్టానం వారి ముగ్గురిని జాతీయ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా వీటిని జారీ చేశారు. దీంతో రానున్న లోకసభ ఎన్నికల్లో వీరు కీలక పాత్ర పోషించనున్నారు.
రాబోయే లోకసభ ఎన్నికల పైన చర్చించేందుకు అమిత్ షా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నేషనల్ కౌన్సెల్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ మేరకు ట్వీట్ చేస్తూ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను (రమణ్, శివరాజ్, వసుంధరా) పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్ ప్రభుత్వాలు మూడు పర్యాయాలు ఉన్నాయి. వసుంధర రాజే ఇటీవలి వరకు రాజస్థాన్ సీఎంగా ఉన్నారు.