'కేజ్రీకి రాజ్యాంగం తెల్సా': ఇంటర్వ్యూలో ఇవి చెప్పారు
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన బీజేపీ నేతలు మండిపడ్డారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీపై యుద్ధం ప్రకటించిన కేజ్రీవాల్, ఆయన డీడీసీఏ అధ్యక్షుడిగా ఉండగా జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేయిస్తున్నారు.
ఇందుకోసం మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణియం ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేజ్రీవాల్ చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారని, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించింది. కేజ్రీవాల్కు రాజ్యాంగం తెలియదని, ఆయన చట్టవ్యతిరేకమైన పనులు చేస్తున్నారంది.
కంపెనీల చట్టం కింద నమోదైన సొసైటీయే డీడీసీఏ అనీ, దాని వ్యవహారంలో విచారణ జరిపే న్యాయపరిధి ఢిల్లీ ప్రభుత్వానికే లేదని బిజెపి నేతలు చెప్పారు. కేజ్రీవాల్ ఒకసారి రాజ్యాంగాన్ని చదవాలనీ, అప్పుడు ఏయే పనులు చేయాలో తెలుస్తుందని బిజెపి అధికార ప్రతినిధి శ్రీకాంత్ శర్మ అన్నారు.
కమిషన్ ఏర్పాటులో చెల్లుబాటును లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఇప్పటికే ప్రశ్నించారన్నారు. విచారణ కమిషన్ను నియమిస్తూ ఢిల్లీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం తిరస్కరించవచ్చని కొందరు అధికారులు చెబుతున్నారు.
మరోవైపు, కేజ్రీవాల్ స్పందిస్తూ... ఢిల్లీ ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ను కేంద్రం ఒకవేళ కొట్టేసినా డీడీసీఏ వ్యవహారాలపై ఆ కమిషనే విచారణ చేస్తుందని స్పష్టం చేశారు.
ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ ఏం చెప్పారు?
కేజ్రీవాల్ ఓ ఇంగ్లీష్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సీనియర్ జర్నలిస్ట్ భార్యకు డిడిసిఎ అధికారుల నుంచి మెసేజ్ వచ్చిందని, నీ కొడుకును టీంలోకి సెలక్ట్ చేసుకోవాలంటే, నీవు మా వద్దకు ఓ రాత్రి రావాలని ఉందని కేజ్రీవాల్ ఇంటర్వ్యూలో చెప్పారు.
డిడిసిఎలోని అవినీతి విషయమై బిజెపి ఎంపీ కీర్తి ఆజాద్ వీడియోను తనకు చూపించారని కేజ్రీవాల్ చెప్పారు. అందులో జైట్లీ మాట్లాడుతూ.. వాళ్లు నావాళ్లని, వారిని కాపాడుతానని చెప్పినట్లు ఉందన్నారు.
డిడిసిఎలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు.
వ్యాపం కేసులో ప్రధాని మోడీ సిబిఐ దాడులు ఎందుకు చేయించలేదని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై స్పందిస్తూ... నేను మీ కళ్లలోకి సూటిగా చూసి మాట్లాడుతున్నానని, ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదని కేజ్రీవాల్ అన్నారు. మోడీ పైన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు అవసరం లేదన్నారు.
కేజ్రీవాల్ ప్రధాని మోడీని ఉద్దేశించి మాట్లాడుతూ... నవాజ్ షరీఫ్ను కౌగిలించుకోవచ్చునని, కానీ నన్ను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేయవద్దన్నారు.
తమను టార్గెట్ చేసుకునేందుకు నిత్యం లెఫ్టినెంట్ గవర్నర్ను ఉపయోగించవద్దన్నారు.
కేంద్రం నుంచి ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి నిధులు కోరుకోవడం లేదని, కానీ మమ్మల్ని నిత్యం వేధించడం ఆపాలని, మేం ఢిల్లీని ప్రగతి బాటన నడిపిస్తామన్నారు.
మా ప్రభుత్వాన్ని కూలగొట్టాలని మోడీ ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు.
లెఫ్టినెంట్ గవర్నర్ తమ మనిషి అని జైట్లీ చెప్పారని, ఇది అందరికీ తెలుసునని కేజ్రీవాల్ అన్నారు.
తమ ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంపై దాడి చేసి ఏం చేశారని కేజ్రీవాల్ అన్నారు.
అర్ధరాత్రి వచ్చి కూడా మా వద్ద సిబిఐ సోదాలు చేసుకోవచ్చునని, కానీ జైట్లీ విచారణకు సహకరించాలన్నారు.