కర్ణాటక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తెలుగింటి ఆడపడుచు?: బీజేపీ మద్దతు ఖాయమైనట్టే?
బెంగళూరు: ప్రముఖ నటి సుమలత రాజకీయ రంగ ప్రవేశంపై కొద్దిరోజులుగా కొనసాగుతున్న సందిగ్ధత తొలగిపోయింది. లోక్ సభ స్థానం కేటాయింపులో కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) కూటమి ఆమెకు హ్యాండివ్వడంతో.. పోటీ చేస్తారా? లేదా? అనే అనుమానాలు ఇన్నాళ్లు వ్యక్తమయ్యాయి. వాటన్నింటినీ తోసిపుచ్చుతూ.. సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం ఆమె బీజేపీ మద్దతును కూడగట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా- శుక్రవారం ఉదయం ఆమె బెంగళూరులో ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్ఎం కృష్ణతో భేటీ అయ్యారు. తాను పోటీ చేయడం ఖాయమైందని, స్వతంత్ర అభ్యర్థిగా లేదా బీజేపీ తరఫున అనేది తాను ఈ నెల 18వ తేదీన ప్రకటిస్తానని సుమలత వెల్లడించారు.
ఆమె భర్త, కేంద్ర మాజీమంత్రి, దివంగత అంబరీష్ గతంలో ప్రాతినిథ్యం వహించిన మండ్య లోక్ సభ స్థానం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు. సుమలతకు భారతీయ జనతాపార్టీ మద్దతు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మండ్య స్థానంలో అభ్యర్థిని నిలబెట్టకూడదని బీజేపీ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ టిక్కెట్పై పోటీకి సెహ్వాగ్ నో, ఎందుకంటే? న్యూఢిల్లీ రేసులో గంభీర్, మౌనిక?
మండ్య లోక్ సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ.. జేడీఎస్ కు వదులుకున్నట్టే. మండ్య స్థానంలో జేడీఎస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు, జాగ్వార్ హీరో నిఖిల్ కుమార్ గౌడ పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని కుమారస్వామి అధికారికంగా వెల్లడించారు కూడా. సుమలత అవకాశాలకు తెర పడినట్టయింది.
నిజానికి- మండ్య స్థానాన్ని కాంగ్రెస్ కు కేటాయిస్తే, సుమలతకే ఆ పార్టీ తరఫున సుమలతకే అవకాశాలు ఉండేవి. తనకు గట్టిపట్టు ఉన్న మండ్యను కాంగ్రెస్ కు ధారాదాత్తం చేయడానికి జేడీఎస్ అంగీకరించలేదు. గెలుపు అవకాశాలు వందశాతం ఉన్నట్టుగా భావిస్తోన్న ఈ స్థానంలో తన కుమారుడిని నిలబెట్టారు కుమారస్వామి.
18న తుది నిర్ణయాన్ని వెల్లడిస్తా: సుమలత
దీన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టట్లేదు సుమలత. తన భర్త గతంలో ప్రాతినిథ్యం వహించిన స్థానం నుంచే తానూ రాజకీయ రంగప్రవేశం చేస్తానంటూ చెబుతూ వచ్చిన ఆమె.. చివరికి- బీజేపీ సహకారాన్ని తీసుకోవడానికి కూడా వెనుకాడట్లేదు. ఈ క్రమంలో- ఆమె శుక్రవారం ఉదయం బెంగళూరులో బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణతో భేటీ అయ్యారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా, మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ.. గత ఏడాది బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనతో మంతనాల సదర్భంగా.. సుమలత తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని కృష్ణ ఆమెకు భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ నెల 18వ తేదీన తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడిస్తానని సుమలత స్పష్టం చేశారు.