బీజేపీ హార్స్ ట్రేడింగ్కు దిగింది..కర్నాటకలో తమ ప్రభుత్వం స్థిరంగానే ఉంది: సూర్జేవాలా
న్యూఢిల్లీ: కర్నాటకలో రాజకీయ సంక్షోభంపై స్పందించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా. ప్రధాని మోడీ, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో కొన్నట్లు కొనేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు ఆయారాం గాయారాం అనే పేరుమాత్రమే మోడీకి ఉండేదని ఇకపై ఫిరాయింపుల మోడీ అనే మరో పేరు వచ్చిందని వెల్లడించారు. దేశంలో హార్స్ ట్రేడింగ్ జరుగుతోందని ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యేలను ఫిరాయించేలా చేయడం, ప్రభుత్వాలను కూల్చడం అనేది దేశంలో నేరం అని సూర్జేవాలా ధ్వజమెత్తారు.కర్నాటకలో జేడీఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు అని మండిపడ్డారు. బీజేపీ తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తోందని కానీ తమ ప్రభుత్వం మాత్రం బలంగానే ఉందని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేలను కొనడం అమ్మడం లాంటి చర్యలకు దిగుతోందని ప్రజాస్వామ్యంలో ఇది సరైనది కాదని సూర్జేవాలా అన్నారు. 12 రాష్ట్రాల్లో ఉన్న ఆయా ప్రభుత్వాలన్నిటినీ కూల్చే ప్రయత్నం బీజేపీ చేస్తోందని వెల్లడించారు.
Randeep Surjewala, Congress: A new symbol of horse trading politics has emerged in the country, MODI - Mischievously Orchestrated Defections in India. pic.twitter.com/JqzLi9tFf6
— ANI (@ANI) July 6, 2019
ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల రాజీనామాలతో బీజేపీకి ఎలాంటి సంబంధాలు లేవని రణదీప్ సూర్జేవాలా చెప్పారు. కర్నాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో బీజేపీకి సంబంధం లేదని మాజీ సీఎం ప్రతిపక్షనేత యడ్యూరప్ప చెప్పారు. 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీలో కలిశారు. సమావేశమైన కాంగ్రెస్ నేతల్లో ఆనంద్ శర్మ, గులామ్ నబీ ఆజాద్, మోతీలాల్ వోరా, అహ్మద్ పటేల్, మల్లికార్జున ఖర్గే, జోతిరాదిత్య సింధియా, జితేంద్రసింగ్, రణదీప్ సింగ్ సూర్జేవాలా, దీపేందర్ హూడాలు ఉన్నారు. మరోవైపు కేరళలో ఉన్న కాంగ్రెస్ ఇంఛార్జ్ కేసీ వేణుగోపాల్ హుటాహుటిన బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు.