జయ, కరుణ ఎఫెక్ట్: ఆ తర్వాత బీజేపీలోకి రజనీకాంత్?
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ పైన తాజాగా మరోసారి ఊహాగానాలు వస్తున్నాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటికప్పుడు రూమర్లు వస్తున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా రజనీ బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. లింగా షూటింగ్ పూర్తయిన తర్వాత రజనీ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తాజాగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం రజనీకాంత్ లింగా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ పూర్తి కాగానే అతను కమలం తీర్థం పుచ్చుకోవచ్చునని జోరుగా ప్రచారం సాగుతోంది.
బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు సౌందరరాజన్ను ఇటీవల రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ ఇంటికి ఆహ్వానించారు. దీంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. రజనీకాంత్ పార్టీలో చేరితే.. పార్టీలో ఆయనకు ఇచ్చే బాధ్యతల పైన చర్చించారనే ప్రచారం సాగుతోంది. రజనీకాంత్ బీజేపీ రానున్నందునే ఈ భేటీ జరిగిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే, నరేంద్ర మోడీ పైన సౌందర రాజన్ ఓ పుస్తకం రాశారు. దీనికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ పుస్తకావిష్కరణకు ఆహ్వానించేందుకే అతను వచ్చారని కూడా అంటున్నారు. రజనీకాంత్ తిరిగి వచ్చాక మరోసారి కలుస్తానని సౌందర రాజన్ చెప్పినట్లుగా తెలుస్తోంది.
కాగా, ప్రస్తుతం తమిళనాడులో అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే పరిస్థితి ఆశించినంతగా లేదు. జయలలిత తన పథకాలతో డీఎంకే పార్టీని తుడిచి పెట్టే పరిస్థితికి తీసుకు వచ్చారు. మొన్నటి లోకసభ ఎన్నికల్లో డీఎంకే పార్టీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. జయలలిత మంచి ఊపులో ఉన్న సమయంలో ఇప్పుడు ఆమె జైలుకు వెళ్లారు.
డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని, ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాగా, ఈ రాజకీయ శూన్యతను ఉపయోగించుకొని బీజేపీ లబ్ధి పొందాలని చూస్తోందని అంటున్నారు. అందుకు రజనీకాంత్ను పార్టీలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు.