ఊహించలేదు: బిజెపి, పాండవులం: కాంగ్రెస్ కౌంటర్
న్యూఢిల్లీ: లోకసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మంగళవారం కాంగ్రెసు పార్టీ సభ్యులను పాండవులతో పోల్చారు. బిజెపి నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ వ్యాఖ్యలను తిప్పి కొట్టేందుకు కాంగ్రెసు పార్టీ ఎంపీలను పాండవులతో పోల్చుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో మాట్లాడుతున్న ఖర్గే... ముగింపు సమయంలో... లోక్ సభలో తాము 44 మంది ఎంపీలు ఉండవచ్చు. కానీ, పాండవులెప్పుడూ వందమంది కౌరవుల ముందు భయపడలేదని వ్యాఖ్యానించారు.
అంతకుముందు సభలో తొలుత మాట్లాడిన రాజీవ్ ప్రతాప్ రూఢీ.. 2014 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఎకు ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా లేదన్నారు. దాంతో, తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఎవరిని ఎలా సంప్రదించాలో తెలియడంలేదని వ్యాఖ్యానించారు.
కానీ, బాధపడాల్సిన అవసరం లేదని... తాము ప్రతి ఒక్కరిని సంప్రదిస్తామని, ఎందుకంటే తమ ప్రధాని నరేంద్ర మోడీ విశాల హృదయం కలవారన్నారు. అలాగే కాంగ్రెసు పార్టీని ప్రాంతీయ పార్టీతో పోల్చారు. ఓ జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీగా లోకసభలో చూడాల్సి వస్తుందని తాము ఎప్పుడు అనుకోలేదని, 65 కాంగ్రెసు పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.
కాంగ్రెసుతో పాటు అన్ని పార్టీల సూచలను తాము తీసుకుంటామని చెప్పారు. అయితే 65 ఏళ్ల పాలనలా సూచనలు ఇస్తే తాము కాంగ్రెస్ పార్టీ నుండి తీసుకునేది లేదని చెప్పారు. రూఢీ వ్యాఖ్యలకు ఖర్గే పై విధంగా స్పందించారు. కాగా ఖర్గే మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెసు నేతలు నిరసన తెలిపారు.