ఎంత పనైపోయింది?: కాంగ్రెస్కు అడ్డంగా దొరికిపోయిన అమిత్ షా..
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ చేజేతులా కాంగ్రెస్ కు మైలేజ్ పెంచే పనిచేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ప్రసంగాన్ని ఎంపీ ప్రహ్లాద్ జోషి తప్పుగా అనువాదం చేయడం కలకలం రేపింది.
అమిత్ షా హిందీలో ప్రసంగిస్తున్న వేళ.. ప్రహ్లాద్ జోషి ఆయన వ్యాఖ్యలను కన్నడలో వివరించారు. ఈ క్రమంలో అమిత్ షా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న జోషి.. 'ప్రధాని నరేంద్రమోడీ దేశాన్ని సర్వనాశనం చేస్తారు... దళితులు, పేదలకు ఆయన చేసిందేమి లేదు... దేశాన్ని ఆయన నాశనం చేయడం ఖాయం' అంటూ చెప్పారు.
నిజానికి అమిత్ షా అక్కడ ఏం చెప్పారంటే.. 'సిద్ధరామయ్య రాష్ట్రానికి చేసిందేమి లేదు. ఎక్కడా ఏ అభివృద్ధి చేయలేదు. యడ్యూరప్పకు ఓటేసి మోడీపై అభిమానాన్ని చాటుకోండి' అని చెప్పారు. దీన్ని పొరపాటుగా అర్థం చేసుకున్న జోషి.. బీజేపీ ఇరుకునపడేలా కన్నడ అనువాదం చేశారు.
Recommended Video
Now that the BJP IT cell has announced Karnataka elections, time for a sneak preview of our top secret campaign video!
— Rahul Gandhi (@RahulGandhi) March 27, 2018
Gifted to us by the BJP President, our campaign in Karnataka is off to a fabulous start. He says Yeddyurappa ran the most corrupt Govt ever...
True. pic.twitter.com/UYqGDZuKyR
కాగా, అమిత్ షా ప్రసంగంలో గతంలోనూ తప్పులు దొర్లాయి. 'అత్యంత అవినీతికి పాల్పడ్డ ప్రభుత్వాలకు పోటీపెడితే యడ్యూరప్ప సర్కారే నంబర్ వన్గా నిలుస్తుంది' అని అప్పట్లో వ్యాఖ్యానించారు. ఆ సమయంలో యడ్యూరప్ప కూడా అమిత్ షా పక్కనే ఉన్నారు. దీంతో ఆ వ్యాఖ్యలు బీజేపీకి తలనొప్పిలా వెంటాడాయి.
ఇక తాజా ఎన్నికల ప్రచారంలో దొర్లిన తప్పిదం కాంగ్రెస్ కు మంచి అస్త్రంగా మారింది. అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీనేతలు వరుస ట్వీట్లతో అమిత్ షాను, బీజేపీని టార్గెట్ చేశారు.
రాహుల్ ట్వీట్:
'కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మాకు గొప్ప ప్రారంభం లభించింది. కాంగ్రెస్ తరుపున ప్రచారం చేసి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. మాకో పెద్ద బహుమతి ఇచ్చారు. యడ్యూరప్ప అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని నడిపారని అమిత్ షానే స్వయంగా చెప్పారు' అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. సీఎం సిద్దరామయ్య స్పందిస్తూ.. 'అబద్దాల పుట్ట అయిన అమిత్ షా.. చివరికి నిజం మాట్లాడారు' అని పేర్కొన్నారు.