నేపాల్,శ్రీలంకల్లోనూ బీజేపీ... త్రిపురం సీఎం వ్యాఖ్యలపై లంక ఎన్నికల కమిషన్ రియాక్షన్...
బ్రిటీషర్లు భారత్ను విభజించి పాలించారని... అంతకు పూర్వం ఇప్పటి పొరుగు దేశాలైన నేపాల్,మియన్మార్,శ్రీలంక,ఆఫ్ఘనిస్తాన్,టిబెట్ తదితర దేశాలు భారత్లో అంతర్భాగం అన్నది కొంతమంది బీజేపీ నేతల వాదన. ముక్కలు చెక్కలుగా విడిపోయిన వీటన్నింటిని మళ్లీ కలిపి అఖండ భారత్ ను నిర్మిస్తామని అప్పుడప్పుడు వేదికలపై వ్యాఖ్యానిస్తుంటారు. రెండేళ్ల క్రితం జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు అఖండ్ భారత్ దిశగా ఇది తొలి అడుగు అని రాం మాధవ్ వంటి బీజేపీ సీనియర్ నేతలు వ్యాఖ్యానించారు.
తాజాగా త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో అఖండ భారత్ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పొరుగు దేశాలైన నేపాల్,శ్రీలంకల్లోనూ బీజేపీని విస్తరిస్తామని... అక్కడ కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అధిష్టానం యోచిస్తోందని విప్లవ్ దేవ్ కుమార్ వ్యాఖ్యానించారు. అయితే పొరుగు దేశాల్లో బీజేపీ అడుగుపెట్టడం సాధ్యమేనా... అక్కడి చట్టాలు,రాజ్యాంగం అందుకు ఒప్పుకుంటుందా...అన్నది ప్రశ్న. దీనిపై శ్రీలంక ఎన్నికల కమిషన్ ఛైర్మన్ నిమల్ పూంచిహెవా స్వయంగా స్పందించారు.
'శ్రీలంకకు చెందిన ఏ రాజకీయ పార్టీ లేదా గ్రూప్ విదేశీ సంస్థలు లేదా పార్టీలతో సంబంధం కలిగి ఉండటానికి అనుమతి ఉంటుంది. కానీ విదేశీ రాజకీయ పార్టీలు శ్రీలంకలో పనిచేయడానికి ఇక్కడి చట్టాలు అనుమతించవు.' అని లంక ఎన్నికల కమిషన్ ఛైర్మన్ స్పష్టం చేశారు.
గతేడాది శ్రీలంక అధ్యక్షుడు గొటబాయా రాజపక్సే సోదరుడు బాసిల్ ఓ సందర్భంలో మాట్లాడుతూ... శ్రీలంకలో తమ పార్టీ 'పొడజన పెరమున'ను చైనా కమ్యూనిస్ట్ పార్టీ తరహాలో లేదా భారత్లో బీజేపీ తరహాలో నడిపించాలని భావిస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం.
కాగా,త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ కుమార్ వివాదాస్పద,సంచలన వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ఇంటర్నెట్ రామాయణ,మహాభారత కాలాల్లోనే ఉందని.. ఇప్పుడున్న టెక్నాలజీలో చాలావరకూ అప్పుడే కనిపెట్టారని గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ సమావేశంలో మాట్లాడుతూ... గతంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అమిత్ షా త్రిపురకు వచ్చినప్పుడు శ్రీలంక,నేపాల్లోనూ పార్టీని విస్తరించాలనుకుంటున్నట్లు చెప్పారన్నారు. దీనిపై బీజేపీ పెద్దల నుంచి మాత్రం ఎటువంటి రియాక్షన్ రాలేదు.