కర్ణాటక ఎన్నికలు, 224 నియోజక వర్గాలు, నామినేషన్లు వేసింది మాత్రం, సెంటిమెంట్ !
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసేవారు ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు అధికారులు అవకాశం కల్పించారు. కర్ణాటకలోని 224 శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఇప్పటికే బీఫారంలు పంపిణి చేశారు.
ఊహించలేదు
మొదటి రోజు ఎవ్వరూ ఊహించని విధంగా నామినేషన్లు వెయ్యడానికి అభ్యర్థులు వెనకడుగు వేశారు. బీజేపీకి చెందిన ఒకే ఒక అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ తో పాటు బీజేపీలోని ఇతర అభ్యర్థులు నామినేషన్లు వెయ్యడానికి ముందుకురాలేదు.
సింపుల్ గా వెళ్లారు
సవదత్తి యల్లమ్మ శాసన సభ నియోజక వర్గం బీజేపీ అభ్యర్థి ఆనంద్ విశ్వనాథ్ మామని మంగళవారం ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆనంద్ విశ్వనాథ్ మామని తన వెంట కుటుంబంలోని పెద్దలు, తన నామినేషన్ ను బలపరిచిన ఓటర్లను మాత్రం వెంట తీసుకెళ్లారు. బీజేపీ కార్యకర్తలను ఎవ్వరినీ వెంట తీసుకెళ్లకుండా సింపుల్ గా వెళ్లి నామినేషన్ వేశారు.
సెంటిమెంట్ దెబ్బ
శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ మంగళవారం బీఫారంలు పంపిణి చేసింది. బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఇప్పటికే మొదటి విడత బీఫారంలో పంపిణి చేసింది. అయితే నామినేషన్లు వెయ్యడానికి మొదటి రోజు మంగళవారం కావడంతో సెంటిమెంట్ తో ఎవ్వరూ ముందుకు రాలేదు.
చివరి రోజు అదే వచ్చింది
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వెయ్యడానికి మొదటి రోజు మంగళవారం వచ్చింది. నామినేషన్లు సమర్పించడానికి ఏప్రిల్ 24వ తేదీ వరకు అవకాశం ఉంది. అయితే ఏప్రిల్ 24వ తేదీ మంగళవారం కావడం, మద్యలో ఒక రోజు ఆదివారం సెలవు రావడంతో అభ్యర్థులు మిగిలిన రోజుల్లో మంచి ముహుర్తాలు ఎప్పుడు ఉన్నాయా అని పరిశీలించుకుంటున్నారు.