1972 నుంచి 2014 వరకు ఓటమి అంటే ఎరుగని ఖార్గేకి షాక్, కాంగ్రెస్ కంచుకోటలో బీజేపీ పాగ!
బెంగళూరు: కర్ణాటకలోని కలబురిగిలో 1972 నుంచి 2014 వరకు ఓటమి అంటే ఎరుగని లోక్ సభలోని ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖార్గేకి ఎవ్వరూ ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కలబురిగి లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన మల్లికార్జున్ ఖార్గే బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
కలబురిగి లోక్ సభ నియోజక వర్గం నుంచి మల్లికార్జున్ ఖార్గే మీద పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి డాక్టర్ ఉమేష్ జాదవ్ 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే కలబురిగి లోక్ సభ నియోజక వర్గంలో ఎన్నికల అధికారులు అధికారికంగా ఫలితాలు ప్రకటించాల్సి ఉంది.
ఇంత వరకు 10 సార్లకు పైగా శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన మల్లికార్జున్ ఖార్గే ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఉత్తర కర్ణాటకలో మల్లికార్జున్ ఖార్గేకి మంచి పట్టు ఉంది. అంతటి ప్రభావంతమైన నాయకుడు మల్లికార్జున్ ఖార్గేని మొదటి సారి డాక్టర్ ఉమేష్ జాదవ్ ఓడించారు.
ఇటీవల ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఉమేష్ జాదవ్ కు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బీజేపీ అవకాశం కల్పించింది. మల్లికార్జున్ ఖార్గే లాంటి నాయకుడి చేతిలో ఉమేష్ జాదవ్ ఓడిపోతారని అందరూ అనుకున్నారు. కలబురిగి జిల్లాలోని బీజేపీ నాయకులు ఉమేష్ జాదవ్ కు సహకరించలేదు. అయితే ఈ ప్రభావం మాత్రం ఉమేష్ జాదవ్ మీద చూపించలేకపోయింది.
1972 నుంచి 2014 వరకు శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి అన్ని సార్లు విజయం సాధించిన మల్లికార్జున్ ఖార్గే మొదటి సారి ఓడిపోవడంతో ఆయన అనుచరులు షాక్ కు గురైనారు. కాంగ్రెస్ కు కంచుకోట అయిన కలబురిగి నియోజక వర్గంలో మొదటి సారి బీజేపీ విజయం సాదించింది.