రాష్ట్రీయ విసృత్ ప్రవాస్: 100 రోజుల బీజేపీ యాత్ర, బలహీనప్రాంతాలపై జేపీ నడ్డా ఫోకస్..
బీహర్ ఎన్నికలు సహా.. ఉప ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. దీంతో ఆ పార్టీ ఊపుమీదుంది. విజయం సాధించామని ఉప్పొంగి పోవడం లేదు. 2024 సార్వత్రిక ఎన్నికలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఫోకస్ చేశారు. బీజేపీ బలహీనంగా ఉన్న ప్రాంతాల గుండా యాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రీయ విసృత్ ప్రవాస్ పేరుతో 100 రోజులు పర్యటిస్తారు. ఏయే ప్రాంతాల్లో పర్యటన.. రూట్ మ్యాప్ కూడా సిద్దమయ్యింది. అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన రాష్ట్రాలు, నియోజకవర్గాల గుండా యాత్ర కొనసాగనుంది. ఆ ప్రాంతాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. అక్కడి క్షేత్ర స్థాయి పరిస్థితులను అర్థం చేసుకుంటారు. ఆయా రాష్ట్రాల్లో శాసన సభ్యులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమవుతారు. పార్టీ పటిష్ఠత, విస్తరణ, పొత్తులు, మరిన్ని సీట్లు ఎలా సాధించొచ్చనే అంశాలపై చర్చిస్తారు.
పార్టీ విస్తరణ ఎలా చేయాలనే అంశంపై శ్రేణులకు మార్గనిర్దేశనం చేస్తారు. కరోనా వైరస్ వల్ల యాత్ర సందర్భంగా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. నడ్డా సమావేశమయ్యే హాలులో 200 మంది కంటే ఎక్కువగా ఉండకుండా స్థానిక నేతలు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. నడ్డా సమావేశమయ్యే గదుల వద్ద టెంపరేచర్ పరీక్షించే పరికరాలు, శానిటైజర్లు, మాస్కులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నడ్డా యాత్రను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలను ఏ,బీ,సీ,డీ గ్రూపులుగా విభజించారు. గ్రూపు 'ఏ'లో బీజేపీ పాలిత రాష్ట్రాలు, కీర్ణ ధర్మంతో అధికారంలో ఉన్న రాష్ట్రాలు. ఇక 'బీ' గ్రూపులో అధికారంలో లేని రాష్ట్రాలు ఉంటాయి. 'సీ' గ్రూపులో చిన్న రాష్ట్రాలు, 'డీ' గ్రూపులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఉంటాయి. సీ' కేటగిరీ కింద వచ్చే రాష్ట్రాల్లో మాత్రం నడ్డా రెండు రోజులపాటు బస చేస్తారని విశ్వసనీయంగా తెలిసింది.