కర్ణాటక: గురితప్పిన అమిత్షా దండ, బసవన్న మెడను చుట్టిన యెడ్డీ దండ
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు చాళుక్య సర్కిల్లో ప్రముఖ సంఘ సంస్కర్త లింగాయత్ ప్రముఖుడు బసవన్న భారీ విగ్రహానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వేసిన పూలమాల గురితప్పింది.. కానీ, మాజీ సీఎం యాడ్యురప్పవేసిన పూలదండ మాత్రం గురితప్పలేదు.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విస్తృతంగా పర్యటిస్తున్నారు. బిజెపి విజయం కోసం ఆయన వ్యూహలను రచిస్తున్నారు. అయితే అమిత్ షా ప్రచారంలో ఇటీవల కాలంలో అపశృతులు చోటు చేసుకొంటున్నాయి. గురువారం నాడు బసవన్న విగ్రహనికి అమిత్ షా తో పాటు యాడ్యూరప్ప పూలమాలలు వేయాలని భావించారు.
బెంగుళూరు నగరంలోని 12 అడుగుల ఎత్తులో బసవన్న విగ్రహం ఉంది. అయితే ఈ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు క్రేన్పై అమిత్షా, యాడ్యూరప్ప నిల్చున్నారు. అయితే క్రేన్ను ఉపయోగించినా కానీ, విగ్రహం వారికి అందలేదు.
దీంతో క్రేన్లోనే నిలబడి అమిత్ షా బసవన్న విగ్రహంపైకి పూలదండ విసిరేశాడు. కానీ, ఆ దండ బసవన్న విగ్రహంపై పడలేదు. ఆ పూలదండ కిందపడిపోయింది. మాజీ సీఎం యాడ్యురప్ప విసిరిన దండ నేరుగా బసవన్న మెడలోనే పడింది.
ఇది అపశకునమా అని చర్చించుకొనేవారు కూడ లేకపోలేదు. అమిత్ షా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఈ తరహా ఘటనలు కొంత ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేస్తున్నాయి.