మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్కు ఝలక్.. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో బీజేపీ క్లీన్ స్వీప్..
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం కట్టిన ఓటర్లు ఆరు నెలలు తిరగకముందే రూటు మార్చారు. అధికార పార్టీని కాదని, బీజేపీకి పట్టం కట్టారు. మూడు కాంగ్రెస్పాలిత రాష్ట్రాల్లో కమలం హవా కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో క్లీన్ స్వీప్ చేసిన కాషాయ పార్టీ ఛత్తీస్గఢ్లో బలం పుంజుకుంది.
మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్కు షాక్
గతేడాది డిసెంబర్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లను ఎగరేసుకుపోయిన కాంగ్రెస్కు ఈసారి ఓటర్లు షాకిచ్చారు. ఆరు నెలలు తిరక్కుండానే అధికారపార్టీని పక్కనబెట్టారు. గతేడాది చివరలో ఈ మూడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఊహించని విజయం సాధించింది. దీంతో సార్వత్రిక ఎన్నికల్లోనూ అవే ఫలితాలు రిపీట్ అవుతాయని కాంగ్రెస్ ఆశపెట్టుకుంది. అయితే ఓటర్లు మాత్రం కాంగ్రెస్ను కాదని కమలం పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టారు.
రెండు రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్
సార్వత్రిక ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. రాజస్థాన్లో 25 ఎంపీ సీట్లకుగానూ మొత్తం స్థానాలను ఎగరేసుకుపోయింది. మధ్యప్రదేశ్లో 29 స్థానాలుండగా... 28లో పాగా వేసిన బీజేపీ కాంగ్రెస్కు ఒక్క స్థానాన్ని వదిలిపెట్టింది. ఛత్తీస్గఢ్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏం లేదు. ఆ రాష్ట్రంలో మొత్తం 11 లోక్సభ స్థానాలున్నాయి. వాటిలో 9 బీజేపీ కైవసం చేసుకోగా... కాంగ్రెస్ 2 సీట్లు నిలబెట్టుకుంది.
కర్నాటకలోనూ కమలం జోరు
కాంగ్రెస్ - జేడీయూలు కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసిన కర్నాటకలో బీజేపీ సత్తా చాటుతోంది. రాష్ట్రంలో 28 ఎంపీ నియోజకవర్గాలుండగా.. బీజేపీ 24 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ - జేడీఎస్ కూటమి 4 సీట్లకే పరిమితమయ్యాయి. సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ మండ్యలో సుమలత చేతిలో ఓటమి పాలయ్యాడు.