శూన్యం నుంచి శిఖరానికి! భయాన్ని జయించారు: ఈశాన్య ఫలితాలపై మోడీ ఆనందోత్సాహం
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనూహ్యమైన ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆనందం వ్యక్తం చేశారు. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడిన విషయం తెలిసిందే.
త్రిపురలో బీజేపీ ఘన విజయం దాదాపు ఖరారైపోయింది. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా తన స్పందనను తెలియజేశారు.
ప్రజల విశ్వాసం
ఎన్నికల ఫలితాలపై తన ఆనందాన్ని వరుస ట్వీట్లలో వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. ఎన్నికలు మారుతున్నా.. ఎలాంటి సమయంలోనైనా ఎన్డీయే ప్రభుత్వం, తమ అభివృద్ధి అజెండాలపై ప్రజలు విశ్వాసం చూపిస్తున్నారని మోడీ అన్నారు. మోసపూరిత, ప్రతికూల రాజకీయాలను ప్రజలు ఎన్నటికీ గౌరవించరని ఆయన చెప్పారు.
మీకో అహర్నిశలు
‘త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్లో ప్రజలు తమ తీర్పును ఇచ్చారు. బీజేపీ అభివృద్ధి అజెండాలో ఒకటైన ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ'కి, మా కూటమి పార్టీలకు మద్దతిచ్చినందుకు ఈ రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడి ప్రజల కోరికలు, ఆశయాలను నెరవేర్చేందుకు అహర్నిశలు పాటుపడుతాం' అని మోడీ తెలిపారు.
మాటలు సరిపోవు..
అంతేగాక, ‘2018 త్రిపుర ఎన్నికలు నవశకానికి నాంది పలికాయి. త్రిపుర సోదర, సోదరీమణులు అద్భుతం చేశారు. వారికి కృతజ్ఞతలు చెప్పేందుకు మాటలు సరిపోవడం లేదు. త్రిపురలో మార్పు తీసుకొచ్చేందుకు మేం ఏ మార్గాన్ని వదిలిపెట్టబోం' అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
శూన్యం నుంచి శిఖరానికి..
‘త్రిపురలో విజయం సాధారణ ఎన్నికల విజయం కాదు. శూన్యం నుంచి శిఖరానికి చేరుకున్నాం. ఇందుకు అభివృద్ధి అజెండాలు ఎంతగానో దోహదం చేశాయి. దీన్ని సుసాధ్యం చేసేందుకు ఏళ్ల తరబడి శ్రమిస్తున్న ప్రతి బీజేపీ కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ రోజు శాంతి, అహింస కలిసి భయాన్ని ఓడించాయి. త్రిపుర ప్రజలకు సరైన పాలన అందిస్తాం. మేఘాలయ, నాగాలాండ్లలోనూ బీజేపీకి మద్దతిచ్చినందుకు సంతోషంగా ఉంది. వారందరికీ కృతజ్ఞతలు' అని మోడీ తెలిపారు.