బెంగాల్ రాష్ట్రంపై బిజెపి కేంద్రీకరణ, యూపి విజయంతో వలసలపై ఆశలు
యూపి రాష్ట్రంలో బిజెపి ఘన విజయం సాధించడంతో మంచి ఊపు మీద ఉన్న బిజెపి బెంగాల్ రాష్ట్రంలో కూడ పట్టు సాధించేందుకు వ్యూహరచన చేస్తోంది.
కోల్ కతా: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘన విజయంతో పాటు మంచి ఊపు మీద ఉన్న బిజెపి బెంగాల్ రాష్ట్రంపై కేంద్రీకరించింది.వచ్చే ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ప్రతి ఎన్నికల్లో కూడ తృణమూల్ కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థిగా మారేందుకు బిజెపి వ్యూహరచనలు చేస్తోంది.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఆశాజనమకైన ఫలితాలు వచ్చాయి.ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు మంచి ఉత్సాహంలో ఉన్నారు.
అయితే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బిజెపి కేంద్రీకరించాలని భావిస్తోంది. వచ్చే ఏడాది బెంగాల్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో జనరల్ ఎన్నికలు వస్తాయి.అయితే ఈ ఎన్నికల నాటికి గాను తృణమూల్ కాంగ్రెస్ కు ప్రధాన పోటీగా నిలిచేందుకు కసరత్తు చేయాలని ఆ పార్టీ వ్యూహలను సిద్దం చేస్తోంది.
ఈ మేరకు బిజెపి బెంగాల్ రాష్ట్రంలో బలోపేతం కావడానికి త్రిముఖ వ్యూహలను సిద్దం చేస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.మమత బెనర్జీ నాయకత్వంలోని అవినీతి ప్రభుత్వం జోల పాడే విధానాన్ని అనుసరిస్తోందని, దీంతో ప్రజలు విసిగిపోయారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ వర్గీయ చెప్పారు.
అయితే బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. 10 జిల్లాల్లో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. జాతి వ్యతిరేకులకు బెంగాల్ రాష్ట్రం కేంద్రంగా మారిందన్నారాయన.
జిల్లా కార్యవర్గాలు, అనుబంధసంస్థలను త్వరలోనే బలోపేతం చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విజయంతో ఇతరపార్టీలకు చెందిన నేతలు తమ పార్టీలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారని ఆయన చెప్పారు.అయితే ఇతర పార్టీల నుండి తమ పార్టీలో చేరేందుకు స్పెషల్ స్క్రీనింగ్ కమిటీ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుందన్నారాయన.
మేధావులను, ప్రముఖులను ఆకర్షించాలని బిజెపి ప్రయత్నిస్తోంది. తృణమూలు కాంగ్రెస్ పార్టీ చేపట్టే తప్పుడు విధానాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకుగాను పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.