ఉగ్రదాడికి ప్రతీకారం, పాక్ కు చైనా మద్దతు, ప్రత్యుత్తరానికి సమయం, అన్ని యుధ్దాల్లో!
బెంగళూరు: ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పవలసిన సమయం వచ్చిందని, పూల్వామా ఉగ్రదాడికి ప్రత్యుత్తరం చెప్పాలని, ప్రధాని నరేంద్ర మోడి సైనికులకు సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప అన్నారు. బెంగళూరు బీజేపీ నగర కార్యకర్తలు మౌర్య సర్కిల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీర జవాన్లకు బీఎస్. యడ్యూరప్ప నివాళులు అర్పించారు. అనంతరం పాకిస్తాన్ తీరుకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం
ధర్నాను ఉద్దేశించి మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఈశాన్య భారతదేశంలో నాగా ఉగ్రవాదులను అనిచివేశారని, ఉరి ఉగ్రవాదులను మట్టికరిపించారని, అలాగే పూల్వామా ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు. సైనికులకు దేశంలోని ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటుందని మాజీ సీఎం యడ్యూరప్ప అన్నారు.
వేర్లు కదలించాలి
ఉగ్రవాదులను అనిచివేయడానికి ఉగ్రవాదాన్ని వేర్లతో పీకేయాలని మాజీ సీఎం యడ్యూరప్ప ప్రజలకు పిలిపునిచ్చారు. మన సైనికుల ప్రతి రక్తపు బొట్టు కళ్లు చూస్తున్న పాకిస్తాన్ కు ప్రత్యుత్తరం ఇవ్వడానికి సమయం వచ్చిందని, ఆ పని చెయ్యడానికి సైనికులకు ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి స్వాతంత్రం ఇచ్చారని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప అన్నారు.
పాక్ తో యుధ్దాలు !
జమ్మూ కాశ్మీర్ లో దో ప్రధాన్, దో విధాన్, దో నిశాన్ ఉండకూడదని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చెప్పారని బీఎస్. యడ్యూరప్ప గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ నీచపాలనతో కాశ్మీర్ లో సమస్యలు వచ్చాయని బీఎస్. యడ్యూరప్ప ఆరోపించారు. భారత్ తో జరిగిన అన్ని యుద్దాల్లో ఓడిపోయినా పాకిస్తాన్ కు బుధ్దిరాలేదని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సరైన సమాధానం చెప్పడానికి సిద్దం అయ్యిందని బీఎస్ యడ్యూరప్ప అన్నారు.
కాంగ్రెస్ కారణం
బీజేపీ ఎంపీ శోభాకరంద్లాజే మాట్లాడుతూ కాశ్మీర్ లోని దాదాపు 45 వేల చదరపు మీటర్ల ప్రాంతాన్ని పాక్ అక్రమించుకుందని ఆరోపించారు. దీనంతటికి కారణం 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన అని ఆమె ఆరోపించారు. మన దేశం ఉప్పు తింటూ, నీళ్లు తాగుతున్న హురియత్ నాయకులు దేశద్రోహానికి పాల్పడుతున్నారని శోభాకరంద్లాజే ఆరోపించారు.
పాక్ కు చైనా మద్దతు
ఇదే సందర్బంలో పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదుల దేశంగా మారిపోయిందని ఆరోపించారు. పాకిస్తాన్ కు చైనా సంపూర్ణ మద్దతు ఇస్తోందని అన్నారు. చైనాలో తయారౌతున్న వస్తువులు భారత్ లోకి రావాలంటే 200 శాతం పన్ను విధించాలని డిమాండ్ చేశారు. కాశ్మీర్ ను పూర్తిగా సొంతం చేసుకోవాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నదని మా సహనాన్ని ఇంకా పరీక్షంచకూడదని ఉగ్రవాదులను బీజేపీ మైనారిటి విభాగం నాయకుడు అబ్దుల్ అజీం హెచ్చరించారు.