కోహ్లీ పెళ్లిపై వ్యాఖ్యలు: ఎమ్మెల్యేకు బిజెపి వార్నింగ్
గునా (మధ్యప్రదేశ్) : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క వివాహంపై తమ పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను బిజెపి ఖండించింది. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతుల దేశభక్తిని ప్రశ్నిస్తూ బిజెపి ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్యా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
కోహ్లి దేశభక్తిని ప్రశ్నించాల్సిన అవసరం శాక్యాకు లేదని బిజెపి తేల్చి చెప్పింది. ఇప్పటికైనా ఆ ఎమ్మెల్యే తీరు మార్చుకుంటే మంచిదని హెచ్చరించింది.. ' విరాట్ కోహ్లి-అనుష్క శర్మ దేశభక్తిని ప్రశ్నించాల్సిన అవసరం ఆ ఎమ్మెల్యేకు లేదని స్పష్టం చేసింది.
నచ్చిన చోట వివాహం చేసుకుంటారు..
నచ్చినచోట పెళ్లిచేసుకొనే అవకాశం కోహ్లీ, అనుష్కలకు ఉందని బిజెపి చెప్పింది. బీజేపీ ఇమేజ్ను దెబ్బతీసేందుకు ఆ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారని,. ఇప్పటికైనా ఆయన తీరు మార్చుకోవాలని మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత ఎస్ ప్రకాశ్ తెలిపారు. బీజేపీ ప్రతిష్ట దెబ్బతినే వ్యాఖ్యలు ఇకముందు చేయొద్దని పన్నాలాల్ను ఆయన హెచ్చరించారు.
ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఇవీ..
ఇండియాలో విపరీతమైన కీర్తిని సంపాదించుకుని, డబ్బులు సంపాదించి.. వాటిని ఇటలీలో ఖర్చుపెట్టిన విరాట్-అనుష్కలకు అసలు దేశభక్తి ఉందా? ఈ దేశంలోనే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, విక్రమాదిత్యుడు, ధర్మరాజు లాంటి పురాణ పురుషులు ఇక్కడే పెళ్లిళ్లు చేసుకున్నారని శాక్యా అన్నారు.
ఇక్కడ సంపాదించిన డబ్బు..
మనలో ఎవరైనా విదేశాలకు వెళ్లి పెండ్లిళ్లు చేసుకున్నామా అని శాక్యా ప్రశ్నించారు. మరి కోహ్లి మాత్రం ఆ పని ఎందుకు చేసినట్లు? ఇక్కడ (ఇండియాలో) సంపాదించిన డబ్బును విదేశాల్లో ఖర్చుచేయడమేమిటని పన్నాలాల్ అన్నారు.
ఇలా వారి పెళ్లి..
విరాట్-అనుష్కల పెళ్లి డిసెంబర్ 11న ఇటలీలోని ప్రఖ్యాత టస్కనీ నగరానికి సమీపంలో.. 800 ఏళ్ల నాటి గ్రామంలో ఉన్న బోర్గో ఫినోచీటీ రిసార్ట్లో వైభవోపేతంగా జరిగిన విషయం తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిచింది. సన్నిహితుల కోసం డిసెంబర్ 21న ఢిల్లీలో, 26న ముంబైలో రిసెప్షన్ ఇవ్వనున్నారు.