బీజేపీ ఆరోపణలు నిజమన్న మాయావతి.. కాంగ్రెస్పై ధ్వజం.. బీఎస్పీ లెక్కలేంటో?
లక్నో : లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఝలక్ ఇచ్చారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. కాంగ్రెస్ తలకెత్తుకున్న కనీస ఆదాయ పథకంపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను సమర్థించారు. అటు బీజేపీని కూడా ఏకిపారేశారు. ట్విట్టర్ వేదికగా రెండు పార్టీలపై నిప్పులు చెరిగారు. ప్రజా సంక్షేమం పట్టని ఒకే గూటికి చెందిన రెండు పక్షులని మండిపడ్డారు.
బీజేపీ అటాక్.. మాయావతి ఝలక్
కాంగ్రెస్ గరీబీ హఠావో 2.0 పథకం బూటకమని ఆరోపిస్తోంది బీజేపీ. అందులో భాగంగా ప్రచార సభల్లో, సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తోంది. అయితే బీజేపీ ఆరోపణల్లో నిజముందంటూ మాయావతి ట్వీట్ చేయడం హాట్ టాపికయింది. అంతేకాదు బీజేపీ కూడా అసత్య హామీలు ఇవ్వడంలో నెంబర్ వన్ అంటూ వ్యాఖ్యానించారు.
83 శాతం పట్టభద్రులు వ్యతిరేకించారు.. టీఆర్ఎస్కు ఇది గుణపాఠమే : జీవన్ రెడ్డి
దొందూ దొందే..!
పేదలు, రైతులు, కార్మికుల సంక్షేమం.. ఆ రెండు పార్టీలు పట్టించుకోవని ఆరోపించారు మాయావతి. కాంగ్రెస్, బీజేపీ ఒకే గూటి పక్షులని విమర్శించారు. ఒకే విధానాలను అవలంభిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడంలో ముందుంటాయని చురకలంటించారు. అయితే కాంగ్రెస్ పార్టీ కనీస ఆదాయ పథకం ‘న్యాయ్'ను ప్రకటించిన తర్వాత తొలిసారిగా మాయావతి ఇలా స్పందించారు.
మాయావతి లెక్కలు..!
ఎన్నికల వేళ దిద్దుబాటు చర్యల్లో భాగంగా మాయావతి ఇలా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. యూపీలో కాంగ్రెస్, ఎస్పీ-బీఎస్పీ కూటమి పరస్పర అంగీకారంతో కొన్ని స్థానాల్లో పోటీ నుంచి తప్పుకున్నాయి. దీంతో కాంగ్రెస్, బీఎస్పీ కూటమి మధ్య అంతర్గత ఒప్పందం ఉందనేది బీజేపీ నేతల వాదన. ఆ క్రమంలో రానున్న ఎన్నికల్లో తమ కూటమికి నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే మాయావతి కాంగ్రెస్ పార్టీపై ఈ విధమైన వ్యాఖ్యలు చేసినట్లుగా అర్థమవుతోంది.