అంతా బీజేపీ కుట్రే!, చీలిక తెచ్చి తమిళనాడును శాసించడానికే: విజయశాంతి
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమిళనాడు రాజకీయాలను శాసించాలనుకుంటోందని, అందులో భాగంగానే ఐటీ దాడులు, ఆర్కేనగర్ నియోజకవర్గ ఉపఎన్నిక రద్దు వంటివి జరిగాయని ఆమె ఆరోపించారు.
చెన్నై: పన్నీర్-శశికళ మధ్య ఆధిపత్య పోరు తెరపైకి వచ్చిన సమయంలో.. ఆ రాష్ట్ర తాత్కాళిక గవర్నర్ విద్యాసాగర్ రావు తీరు పట్ల విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓవైపు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని చెబుతున్నా.. శశికళను ప్రమాణం స్వీకారానికి ఆహ్వానించకుడా ఆయన తాత్సారం చేశారు.
ఇదే సమయంలో అక్రమాస్తుల కేసు కూడా తెరపైకి రావడం ఇదంతా బీజేపీ వ్యూహమే అన్న వాదన వినిపించింది. ఆ తర్వాత శశికళ జైలుకెళ్లడం, పళనిస్వామి సీఎం అవడం జరిగిపోయాయి. అప్పటిదాకా పూటకో మలుపు తిరిగిన రాజకీయాలు ఆ తర్వాత కాస్త స్థిరంగా పయనిస్తున్నట్లు కనిపించాయి. ఇంతలోనే ఆర్కేనగర్ ఉపఎన్నిక రావడం.. విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరుగుతోందన్న ఆరోపణలతో ఏకంగా ఎన్నికలనే రద్దు చేసే పరిస్థితి వచ్చింది.
దీంతో శశికళ వర్గం నేతలంతా మరోసారి బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపిస్తున్నారు. తాజాగా ఓ టీవి చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ఎంపీ విజయశాంతి ఇవే ఆరోపణలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమిళనాడు రాజకీయాలను శాసించాలనుకుంటోందని, అందులో భాగంగానే ఐటీ దాడులు, ఆర్కేనగర్ నియోజకవర్గ ఉపఎన్నిక రద్దు వంటివి జరిగాయని ఆమె ఆరోపించారు.
మిగతా పార్టీల సంగతెలా ఉన్నా అన్నాడీఎంకెలో చీలిక తేవడమే బీజేపీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని విజయశాంతి ఆరోపించారు. వాస్తవానికి అన్నాడీఎంకెలో చీలికలంటూ లేవని, అందరూ ఐక్యంగానే ఉన్నారని విజయశాంతి వెల్లడించింది. అమ్మ చనిపోయిన తర్వాతే ఈ కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.
కాగా, ఆర్కేనగర్ నియోజకవర్గంలో దాదాపు రూ.70కోట్లు పంచినట్లుగా వార్తలు రావడం, దానికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు పొక్కడంతో.. వాటిని పరిశీలించిన ఎన్నికల కమిషన్ ఉపఎన్నికను రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు వరుసగా జరుగుతున్న ఐటీ దాడులు అన్నాడీఎంకె నేతలను కలవరపరుస్తున్నాయి.