కశ్మీర్లో మిలిటెంట్ల ఘాతుకం: కౌన్సిలర్పై కాల్పుల మోత, నేలకొరిగిన నేత..
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. నేతల లక్ష్యంగా కాల్పులు జరుపుతున్నారు. బుధవారం రాత్రి జరిపిన కాల్పుల్లో బీజేపీ కౌన్సిలర్ భూపిందర్ సిగ్ చనిపోయారు. బుద్గాం జిల్లా దాల్వాస్ గ్రామంలో గల తన ఇంటి బయట భూపిందర్ సింగ్పై కాల్పుల మోత మోగించారు. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. రాత్రి 7.45 గంటలకు కాల్పులు జరిగాయని పోలీసులు ధృవీకరించారు.
కశ్మీర్లోని ఖాగ్ బ్లాక్ డెవలప్ మెంట్ కౌన్సిల్కు భూపిందర్ సింగ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఇతనికి ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. అయితే బుధవారం వారిద్దరనీ ఖాగ్ పోలీసు స్టేషన్ వద్ద వదిలేసి తన ఇంటికి బయల్దేరాడు. శ్రీనగర్లోని అలూచిబాగ్ వెళతానని చెప్పి.. స్వగ్రామం దాల్వాస్ గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో అతను పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. అతను ఒంటరిగా వస్తోన్న విషయాన్ని గమనించి మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు.
ఇదే కాదు ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఆగస్ట్ 6వ తేదీన బీజేపీ అనుబంధ సర్పంచ్ సజద్ అహ్మద్ ఖాండీని కూడా కుల్గం జిల్లాలో కాల్చిచంపారు. జూలై 8వ తేదీన బందపోరలో షేక్ వసీం బరీని కూడా కాల్చిచంపారు. అయితే ఆ సమయంలో అతని తండ్రి, సోదరుడు కూడా చనిపోయారు. ఆగస్ట్లో బుద్గాం బీజేపీ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ నజర్పై కాల్పులు జరపగా.. తీవ్ర గాయాలతో అతను చికిత్స తీసుకుంటున్నారు.