పోటీకి 75 ఏళ్లు కటాఫా?.. యువతకు ఛాన్సుందా?.. బీజేపీ మర్మమేంటో?
ఢిల్లీ : లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీజేపీ సరికొత్త నిర్ణయం తీసుకోనుందా? పార్టీ నుంచి పోటీచేసే అభ్యర్థులకు ఏజ్ కటాఫ్ ప్రకటించనుందా? 75 ఏళ్లు దాటిన పెద్దలకు ఈసారి నో ఛాన్సేనా? ఇలాంటి ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఇదంతా కూడా యువరక్తానికి చోటు కల్పించడానికే అన్నట్లుగా ప్రచారం సాగుతున్నా.. 75 ఏళ్ల వయోపరిమితి అంటే మళ్లీ వృద్ధులకే పట్టం కడుతున్నట్లుగా అనే వాదనలు లేకపోలేదు. సీనియార్టీ అంటూ మళ్లీ పెద్దోళ్లకే ఛాన్స్ దక్కుతుందనేది ఛోటా నేతల వాదన.
22 ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు..! అందులో జైషే మహ్మద్ సంస్థలెన్నో తెలుసా?
75 కటాఫ్.. యువతకు ఛాన్సుందా?
2014 ఎన్నికల జోష్ తలపించేలా రానున్న లోక్సభ ఎన్నికలను సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశవ్యాప్తంగా మరోసారి కమలం వికసించేలా తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. లోక్సభ ఎన్నికలకు ప్రిపేరవుతూనే మరోవైపు సంక్షేమ పథకాల పట్ల కన్నేశారు. ఓటర్ల నాడిని పసిగట్టి వారికి దగ్గరయ్యేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అదలావుంటే బీజేపీ తాజాగా 75 ఏళ్ల వయస్సునవారికే టికెట్లిచ్చే యోచన ఉందనే ప్రచారం చర్చానీయాంశంగా మారింది. కురువృద్ధులకు గుడ్ బై చెప్పాలనుకుని ఈ ప్లాన్ వేసినా.. 75 ఏళ్లు కటాఫ్ పెడితే మళ్లీ సీనియర్లకే అవకాశం దక్కుతుందిగా అనేది ఛోటా లీడర్ల ఆవేదన. మహా సముద్రం లాంటి బీజేపీలో 75 ఏళ్లు లోపు ఉన్న నాయకులకు కొదువ లేదు. సీనియార్టీ గట్రా అంటూ మళ్లీ పెద్దోళ్లకే టికెట్లు పోతాయనే వాదన లేకపోలేదు.
పెద్దోళ్లకు చెక్.. మరీ చిన్నోళ్లకు?
రానున్న ఎన్నికల్లో పార్టీ నుంచి టికెట్లు ఆశించేవారికి వయోపరిమితి విధించాలనే దిశగా బీజేపీ ఆలోచన చేస్తోందని ఓ జాతీయ పత్రిక రాసిన కథనం హాట్ టాపిక్ గా మారింది. 75 ఏళ్లు దాటిన నేతలను ఎన్నికల బరిలోకి దించాలా వద్దా అనే దిశగా ఆ పార్టీ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు రాసింది. ఎన్నికల్లో తలపడనున్న అభ్యర్థులకు సంబంధించి మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారట. అంతేకాదు వచ్చే వారం నుంచే అభ్యర్థులను కూడా ప్రకటించనున్నారట. 2014 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చాక కేబినెట్ లోకి మంత్రులను తీసుకునే విషయంలో వయో పరిమితి విధించారు మోడీ. దానికనుగుణంగానే 75 ఏళ్ల వయసు దాటినివారిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఆ ఏజ్ ఎఫెక్ట్ తో మంత్రి పదవులు రాని సీనియర్లెందరో ఉండటం గమనార్హం.
కటాఫ్ కత్తెర.. ఇంటికి సీనియర్లు?
ఈసారి మరో అడుగు ముందుకేశారు మోడీ. 2014లో కేబినెట్ లోకి తీసుకునే మంత్రులకు వయో పరిమితి విధిస్తే.. ఇప్పుడేమో ఎన్నికల లెవెల్లోనే ఏజ్ ఫ్యాక్టర్ అమలు చేయాలనుకుంటున్నారు. ఒకవేళ ఏజ్ కటాఫ్ నిబంధనకు బీజేపీ మొగ్గు చూపితే.. లోక్సభ బరిలో మహామహులు కనిపించబోరు. ఎల్కే అద్వానీ (91), మురళీ మనోహర్ జోషి (85), బీసీ ఖండూరీ (84), శాంతా కుమార్ (84), కరియా ముండా (82), హుకుందేవ్ నారాయణ్ యాదవ్ (79), కల్రాజ్ మిశ్రా (77), సుమిత్రా మహాజన్ (76), భగత్ సింగ్ కోష్యారి (76), యడ్యూరప్ప (76) లాంటి అగ్రనేతలకు టికెట్లు దక్కకపోవచ్చు.