రెండో భార్య: మోడీ-స్మృతిలపై కాంగ్రెస్ నేత వ్యాఖ్య, దుమ్మెత్తిపోసిన నెటిజన్లు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పైన కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు దారుణ వ్యాఖ్యలు చేశారు. దీంతో, బిజెపి తీవ్రంగా స్పందించింది. ఓ పార్టీ నేత అయి ఉండి దారుణంగా మాట్లాడటాన్ని అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నీలమోణి సేన్ డేకా మాట్లాడుతూ... కేంద్రమంత్రిస్మృతి ఇరానీ ప్రధాని నరేంద్ర మోడీ రెండో భార్యగా అభివర్ణించారు.
నీలమోణి సేన్ డేకా ఆదివారం నల్బరీ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సందర్భంగా పై వ్యాఖ్య చేశారు. స్మృతి ఇరానీ విద్యార్హతలను ఆయన ప్రశ్నించారు. కేంద్ర మహిళా మంత్రి ప్రధానికి రెండో భార్యగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఇక అదే రాష్ట్రానికి చెందిన మరో కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే రూప్ జ్యోతి కుర్మి కూడా ఇదే తరహా వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్యల పైన అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు.
డేకా, కుర్మి వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేతలు సిగ్గుచేటైన వ్యాఖ్యలు చేస్తుంటే కాంగ్రెస్ అధిష్ఠానం ఏం చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ప్రశ్నించారు.
అసోం బీజేపీ శాఖ అధ్యక్షులు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ ఇద్దరు నేతలపై కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు వేయాలని డిమాండ్ చేశారు.
అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రధాని మోడీ పైన ఆ తరహా వ్యాఖ్యలు చేసిన వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డేకా, కుర్మిలపై తాము పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. డేకా వ్యాఖ్యలపై ట్విట్టర్ వంటి సామాజిక వేదికల్లోను విమర్శలు వెల్లువెత్తాయి.