బీజేపీ ఆఫర్ ఇచ్చింది, కానీ తిరస్కరించాను: సౌరభ్ గంగూలీ
న్యూఢిల్లీ: తాను బీజేపీలో చేరనున్నట్లుగా వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ స్పందించారు. "అవును, పార్టీలో చేరేందుకు బీజేపీ నాకు అవకాశం ఇచ్చింది. కానీ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించాను. ఎన్నికల్లో పోటీ చేయను." అని స్పష్టం చేశాడు.
2014లో జరిగిన సాధారణ ఎన్నికల ముందు కూడా గంగూలీ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సౌరభ్ రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వస్తున్నప్పటికీ ఖండిస్తూనే వచ్చాడు.
భారత్ క్రికెట్లో ఎక్కువ అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్లలో గంగూలీ ఒకడు. గంగూలీ బీజేపీలోకి చేరితో పశ్చిమ బంగాల్లో పార్టీ పుంజుకోవడంతో పాటు తృణమూల్ కాంగ్రెస్కు గట్టి పోటీనిస్తుంది.
రెండు రోజులు క్రితం తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ దినేశ్ త్రివేది బీజేపీలో చేరుతున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఆ వార్తలను ఖండించారు.
ఇక టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని బీజేపీ తేల్చి చెప్పింది. బీజేపీ జాతీయ సెక్రటరీ సిద్దార్ధ నాథ్ సింగ్ గురువారం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
బీజేపీలోని కొంత మంది నాయకులు ఆయనతో మంచి సంబంధాలు కలిగి ఉన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. బీజేపీలో చేరే విషయమై ఆయనతో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సౌరభ్ను డిసెంబర్ 2014న నామినేట్ చేశారు. స్వచ్చ్ భారత్ లో పాల్గొనాలని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుకు గంగూలీ స్పందిస్తూ ప్రధాని ఆహ్వానం మేరకు స్వచ్చ్ భారత్లో పాల్గొంటానని కాని రాజకీయాలలోకి మాత్రం రానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.