బీజేపీకి అసమ్మతి సెగ, ఎమ్మెల్యేల రహస్య సమావేశం, మంత్రి పదవులు ఇస్తాం, ఆవేశం వద్దు !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం తొలి మంత్రివర్గ విస్తరణ తరువాత బీజేపీకి అసమ్మతి సెగ తలిగింది. మంత్రి పదవులు రాలేదని పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం నిర్వహించడంతో ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప వర్గీయులు షాక్ కు గురైనారు. రహస్యంగా ఎవరెవరు సమావేశం నిర్వహిస్తున్నారు ? అంటూ ముఖ్యమంత్రి యడియూరప్ప వర్గీయులు నిఘా వేశారని సమాచారం. ఆవేశం వద్దని, మంత్రి పదవులు ఇస్తామని అసమ్మతి నేతలకు సీఎం యడియూరప్ప నచ్చ చెబుతున్నారు.
బీజేపీ హై కమాండ్
యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 25 రోజుల తరువాత తొలి మంత్రి వర్గం విస్తరించడానికి బీజేపీ హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హై కమాండ్ ఆదేశాల మేరకు మంగళవారం బీఎస్. యడియూరప్ప ప్రభుత్వంలో 17 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా 16 శాఖలు ఖాళీగా ఉన్నాయి. అందులో అనర్హత వేటు పడిన (కాంగ్రెస్, జేడీఎస్) ఎమ్మెల్యేలకు కొన్ని మంత్రి పదవులు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది.
పాత, కొత్త నీళ్లు
యడియూరప్ప ప్రభుత్వంలో 17 మంది మంత్రులుగా భాద్యతలు స్వీకరించారు. వారిలో 13 మంది గతంలో మంత్రులుగా పని చేశారు. కొత్గగా నలుగురికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన జగదీష్ శెట్టర్ సైతం యడియూరప్ప మంత్రి వర్గంలో మంత్రిగా భాద్యతలు చేపట్టారు. పాత, కొత్త నీళ్లతో యడియూరప్ప మంత్రివర్గం ఏర్పాటు అయ్యింది.
మండిపడిన ఎమ్మెల్యేలు
బీజేపీ సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు రేణుకాచార్య, బాలచంద్ర జారకిహోళి, ఉమేష్ కత్తి, జేహెచ్, తిప్పారెడ్డి, గూళిహట్టి శేఖర్, అప్పచ్చు రంజప్, బసవన గౌడ పాటిల్ యత్నాల్, ఎస్, అంగార తదితరులు తమకు మంత్రి పదవులు రాలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు నగరంలోని రేస్ వ్యూ హోటల్ లో బీజేపీ అసమ్మతి ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమై సుమారు రెండు గంటలకు పైగా చర్చించారు
బీజేపీకి అసమ్మతి సెగ
తనకు మంత్రి పదవి రాలేదని ఎలాంటి భాదలేదని రేణుకాచార్య, ఉమేష్ కత్తి తదితరులు పైపైకి చెబుతున్నా రహస్య సమావేశానికి వీరు హజరైనారు. మంత్రి పదవులు ముఖ్యం కాదని, ప్రజల కోసం పని చేస్తామని చెబుతున్నా రహస్య సమావేశం నిర్వహించి బీజేపీ నాయకులకు షాక్ ఇచ్చారు. సీనియర్ ఎమ్మెల్యేలు అసమ్మతి సెగ రుచి చూపించడంతో బీజేపీ నాయకులు అలర్ట్ అయ్యారు.
ఆవేశం వద్దు, పదవులు ఇస్తాం
బీజేపీ సీనియర్ ఎమ్మెల్యేలు ఉమేష్ కత్తి, బాలచంద్ర జారకిహోళి, అప్పచ్చు రంజన్, బసవనగౌడ పాటిల్ యత్నాల్, పూర్ణిమా శ్రీనివాస్, ఎస్. అంగార తదితరులు ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పతో భేటీ అయ్యి చర్చించారు. ఈ సమావేశంలోనే తమకు మంత్రి పదవులు రాలేదని పలువురు సీఎం యడియూరప్ప ముందు అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. మీకు ప్రభుత్వంలో, పార్టీలో కీలక పదవులు వచ్చే విదంగా హై కమాండ్ తో మాట్లాడుతానని, అందరికీ న్యాయం చేస్తామని యడియూరప్ప అసమ్మతి నేతలకు హామీ ఇచ్చారు.