తృతీయ ఫ్రంట్తో జయలలిత: మోడీతో కరుణానిధి?
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత కరుణానిధి కాంగ్రెసుతో పూర్తిగా తెగదెంపులు చేసుకుని బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో దోస్తీ కడుతారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి, అన్నాడియంకె అధినేత జయలలిత తృతీయ కూటమికి దగ్గర కావడంతో కరుణానిధి బిజెపి వైపు చూస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
నరేంద్ర మోడీపై కరుణానిధి ప్రశంసలు కురిపించడం ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఎన్నికలకు ముందే బిజెపితో కరుణానిధి పొత్తుకు సిద్ధపడవచ్చుననే ఊహాగానాలు కూడా తలెత్తాయి. మోడీ కఠిన శ్రామికుడని, మంచి మిత్రుడని కరుణానిధి అన్నారు. తమిళ దినపత్రిక దినమలార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరుణానిధి మోడీపై ప్రశంసల జల్లు కరిపించారు.
వచ్చే లోకసభ ఎన్నికల కోసం ప్రచారం కొనసాగిస్తున్న తీరు నరేంద్ర మోడీ కష్టపడే తత్వాన్ని తెలియజేస్తోందని ఆయన అన్నారు. బిజెపితో పొత్తు పెట్టుకునే విషయాలపై మాట్లాడడానికి కరుణానిధి నిరాకరించారు. అయితే, కాంగ్రెసుతో మాత్రం పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి జయలలితకు మోడీతో సత్సంబంధాలున్నాయి. అయితే, జయలలిత తృతీయ కూటమి వైపు చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఆమె ప్రధాని పదవిపై కూడా కన్నేశారు. దానివల్ల బిజెపితో అన్నాడియంకె పొత్తు పెట్టుకుంటే తన కలనేరదనే విషయం జయలలితకు తెలుసు.
ఇదిలావుంటే, కరుణానిధి వ్యాఖ్యలను బిజెపి స్వాగతిస్తూనే డిఎంకెతో పొత్తు ఉండదని చెప్పింది. ఇప్పటికే బిజెపి ఎండిఎంకె, డిఎండికెతో పొత్తు పెట్టుకుంది. పిఎంకెతో చర్చలు జరుగుతున్నాయి. అయితే, బిజెపితో డిఎంకె పొత్తుకు అవకాశాలు లేకపోలేదని జాతీయ మీడియా వ్యాఖ్యానిస్తోంది. త్వరలో కరుణానిధి, రాజ్నాథ్ సింగ్ మధ్య సమావేశం జరిగే అవకాశాలున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. కొన్ని ప్రాంతీయ పార్టీలతో పాటు ఓ ప్రధానమైన పార్టీతో చర్చలు సాగుతున్నాయని రాజ్నాథ్ సింగ్ ఓ తమిళ పత్రికతో అన్నారు.