రూ.1000 కోట్ల ఆదాయం, బీజేపీ అత్యంత సంపన్నమైన పార్టీ, రెండో స్థానంలో బీఎస్పీ
న్యూఢిల్లీ: 2017 18 సంవత్సరానికి భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) రూ.1000 కోట్ల ఆదాయం వచ్చింది. ఎన్నికల కమిషన్కు సమర్పించిన లెక్కలు వీటిని తెలుపుతున్నాయి. 2018 మార్చి నాటికి మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నిధులు రూ.681 కోట్ల నుంచి రూ.717 కోట్లకు పెరిగాయి.
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నిధులు రూ.262 నుంచి రూ.291 కోట్లకు పెరిగాయి. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ తన నిధుల గురించి ఎన్నికల సంఘానికి సమర్పించవలసి ఉంది.
ఈ ఏడాది మార్చి కల్లా దేశంలోని నాలుగు రాజకీయ పార్టీలు గతంలో కన్నా ఎక్కువ విరాళాలను రాబట్టుకున్నాయి. మొదటి స్థానంలో బీజేపీ ఉండగా, రెండో స్థానంలో బీఎస్పీ ఉంది. కమ్యూనిస్టు పార్టీలకు సైతం మంచి ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో సీపీఎంకు రూ.104 కోట్లు విరాళాలు వచ్చాయి. ఇది బీజేపీ వార్షిక ఆదాయంలో పది శాతం కాగా, సీపీఐకి రూ.1.5 కోట్ల ఆదాయం వచ్చింది.
తాజా లెక్కలతో దేశంలో అత్యంత సంపన్న పార్టీగా బీజేపీ నిలిచింది. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి గోపాల్ అగర్వాల్ స్పందించారు. బీజేపీకి ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రావడానికి ఆర్థిక వ్యవహారాల్లో తాము చూపే పారదర్శకత అన్నారు. బీజేపీ ప్రతి లావాదేవీని అత్యంత పారదర్శకంగా, ఆడిట్ నివేదికలతో సహా ఎన్నికల సంఘానికి సమర్పిస్తుందని, తాము విరాళాలను చెక్కులు, ఆన్లైన్ విధానం ద్వారానే స్వీకరిస్తామని, కొంతమంది ప్రజలు నమో యాప్ ద్వారా కూడా పంపుతున్నారని, కొన్ని పార్టీలు తమకు వచ్చిన అన్ని విరాళాలను ఎన్నికల సంఘానికి ప్రకటించకుండా నల్లధనంగా మార్చుతాయన్నారు.