కర్ణాటక బై పోల్స్: రెబల్స్పై వేటు, ఇండిపెండెంట్గా బరిలోకి దిగడంతో చర్యలు
కర్ణాటకలో 15 స్థానాలకు జరగబోతున్న ఉప ఎన్నిక హీట్ పుట్టిస్తోంది. ఆయా చోట్ల కాంగ్రెస్-జేడీఎస్ నుంచి బీజేపీలో చేరిన వారికి పార్టీ టిక్కెట్లు ఇచ్చింది. అయితే ఇద్దరు బీజేపీ నేతలు నామినేషన్లు వేయడంతో ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ వెనక్కి తీసుకోవాలని ఆదేశించినా.. బేఖాతరు చేయడంతో పార్టీ నుంచి బహిష్కరించింది.
బహిష్కరణ
బచ్చెగౌడ, కవిరాజ్లను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. వారిద్దరు పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్టు పేర్కొన్నది. నామినేషన్ విత్ డ్రాకు గురువారంతో గడువు ముగిసింది. వెనక్కి తీసుకోవాలని వారికి బుధవారం పిలిచి స్పష్టంచేసింది. అయినా వారిద్దరూ విత్ డ్రా చేసుకోకపోవడంతో వేటు వేస్తున్నట్టు వెల్లడించింది.
ఇద్దరిపై చర్యలు
హోస్కోట్ నుంచి కాంగ్రెస్ బహిష్కృత నేత ఎంటీవీ నాగరాజు బరిలోకి దిగుతున్నారు. ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా.. శరత్ బచ్చెగౌడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. ఇక్కడ జేడీఎస్ అభ్యర్థిని నిలుపకుండా బచ్చెగౌడకు మద్దతిస్తోంది.
ఇదీ నేపథ్యం
బచ్చెగౌడ బీజేపీ చిక్కబళ్లపుర ఎంపీ బీఎన్ బచ్చెగౌడ కుమారుడు. శరత్.. బీజేపీ యువమోర్చా కార్యదర్శిగా పనిచేశారు. ఇదివరకు కర్ణాటక హౌసింగ్ బోర్డ్ చైర్మన్గా కూడా విధులు నిర్వర్తించారు. శరత్ తన నామినేషన్ విత్ డ్రా చేసుకోకుంటే పార్టీ నుంచి బహిష్కరిస్తామని యడియూరప్ప ఇదివరకే స్పష్టంచేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికలో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు శరత్ను 7 వేల ఓట్ల తేడాతో ఓడించారు.
కవిరాజ్పై
విజయనగర నుంచి కవిరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ బీజేపీ నుంచి ఆనంద్ సింగ్ బరిలోకి దిగుతున్నారు. ఇతన్ని కూడా ఉపసంహరించుకోవాలని కోరారు. కానీ వినకపోవడంతో పార్టీ నుంచి బహిష్కరించారు.
కారణమిదే..
15 మంది కాంగ్రెస్, జేడీఎస్ నేతలు తిరుగుబావుటా ఎగరవేయడంతో కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. 15 మంది బీజేపీలో చేరి బరిలోకి దిగుతున్నారు. రెండుచోట్ల రెబల్స్ పోటీ చేయడంతో.. వారిని పార్టీ నుంచి బహిష్కరించారు.