బీజేపీది దొడ్డిదారి: తమిళ రాజకీయాలపై నగ్మా సంచలనం
తమిళనాడు ప్రజల గోడు పట్టించుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవని మండిపడ్డారు.
చెన్నై: తమిళనాడులో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి నగ్మా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రజల గోడు పట్టించుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవని మండిపడ్డారు. సత్యమూర్తిభవన్లో గురువారం జరిగిన తమిళనాడు మహిళా కాంగ్రెస్ నిర్వాహకుల సమావేశంలో పాల్గొని రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీరాణితోపాటు నగ్మా మీడియాతో మాట్లాడారు.
తమిళనాడులో కరవు బాధిత రైతులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఢిల్లీలో పోరాడారని, అయితే వారి గోడు పట్టించుకోవడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేదని ధ్వజమెత్తారు. రైతుల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం నెట్టకూడదని, అదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతుల డిమాండ్లు నెరవేర్చడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని పేర్కొన్నారు.
రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపిన వ్యవహారంలో సంబంధం ఉన్న అందరూ శిక్ష పొందాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో బీజేపీకి ఒక శాతం కూడా మద్దతు లేదని, ఎలాగైనా రాష్ట్రంలో కాలుమోపడానికి చూస్తోందని తెలిపారు. అన్నాడీఎంకేలో చీలిక తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. దొడ్డిదారిలో తమిళనాడులో ప్రవేశించేందుకు యత్నిస్తోందని, ఎట్టిపరిస్థితుల్లోనూ తమిళనాడులో బీజేపీ కాలు మోపలేదన్నారు.
రాష్ట్రంలో నివాస ప్రాంతాల మధ్య మద్యం దుకాణాలు తెరుస్తున్నందుకు నిరసనగా మహిళలు పోరాడుతున్నారని తెలిపారు. న్యాయస్థానం ఉత్తర్వులను రాష్ట్రప్రభుత్వం గౌరవించాలని, అడ్డదారిలో మద్యం దుకాణాలు తెరవడానికి ప్రయత్నించకూడదని పేర్కొన్నారు. మహిళలను కించపరచిన కేరళ మంత్రిని పదవి నుంచి తొలగించాలన్నారు. ఇదే డిమాండ్తో కేరళలో ఆందోళనలు జరుగుతున్నాయని గుర్తు చేశారు.