సెలబ్రిటీలపై కన్నేసిన కమలం పార్టీ: బీజేపీలోకి అక్షయ్ కుమార్, మాధురీ దీక్షిత్..?
2019 సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీ సినిమా స్టార్లపై కన్నేసింది. వీలైనంత ఎక్కువమంది సినీ స్టార్లు బీజేపీలో చేర్పించే బాధ్యతను స్థానిక నాయకులకు అప్పగించింది బీజేపీ. ఇందులో భాగంగానే నిన్నటి తరం బాలీవుడ్ నటి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆమె పలు హిందీ బెంగాలీ సినిమాల్లో నటించారు. ఇంకా బీజేపీ తీర్థం పుచ్చుకునే సినిమా స్టార్లు ఎవరో ఓ లుక్కేద్దాం.
బీజేపీ తీర్థం పుచ్చుకున్న బాలీవుడ్ నటి మోషుమీ ఛటర్జీ
2019 లోక్సభ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రజల్లో గుర్తింపు పొందిన సినిమా స్టార్లను టార్గెట్గా ఆ పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నం ప్రారంభించింది. ఇప్పటికే కమలం పార్టీలో పలువురు సినీ స్టార్లు ఉండగా... తాజాగా నిన్నటి తరం నటి మోషుమీ ఛటర్జీ కాషాయం కండువాను కప్పుకున్నారు. కోల్కతాలో బుధవారం ఆమె అధికారికంగా పార్టీలో చేరారు. మోషుమీ ఛటర్జీ పలు హిందీ సినిమాలతో పాటు బెంగాలీ సినిమాల్లో కూడా నటించారు. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున సినిమా స్టార్లు పాల్గొనేలా వ్యూహం రచిస్తున్నారు కమలనాథులు. ఇందులో భాగంగానే సినీరంగం నుంచి మరికొందరు స్టార్లు కమలం తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
బాలీవుడ్ స్టార్లు క్రికెటర్ల పై కన్నేసిన కమలం పార్టీ
అత్యంత విశ్వసనీయ వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం 2019 ఎన్నికల సమయానికి బీజేపీలో పెద్ద ఎత్తున సినిమా స్టార్లు చేరనున్నట్లు తెలుస్తోంది. వీరిలో స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్, కంగనా రనౌత్, ప్రతీ జింటా, పల్లవి జోషి, రవీనా టాండన్, అక్షయ్ కుమార్లు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న క్రికెటర్లకు కూడా బీజేపీ గాలం వేస్తోంది. ఇప్పటికే కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు ఫుట్బాల్ క్రీడాకారుడు బైచుంగ్ భూటియాతో కూడా బీజేపీ వర్గాలు మాట్లాడినట్లు తెలుస్తోంది.
మాధురీ దీక్షిత్తో అమిత్ షా భేటీ
2008-13 మధ్య నాడు కర్నాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రముఖ క్రికెటర్ అనిల్ కుంబ్లేను కర్నాటక రాష్ట్ర వన్యప్రాణుల బోర్డుకు ఉపాధ్యక్షుడిగా నియమించింది. అది క్యాబినెట్ ర్యాంకుతో సమానం. నాడు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేపట్టిన సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమంలో నటి మాధురీ దీక్షిత్తో సమావేశం అయ్యారు. ఆమెను మహారాష్ట్ర నుంచి బరిలోకి దించేలా బీజేపీ వ్యూహాలను రచిస్తున్నట్లు తెలుస్తోంది. బెంగాల్లో 20కి పైచిలుకు స్థానాలపై కమలనాథులు కన్నేశారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో కమలం పార్టీ ప్రజాదరణ కలిగిన సినిమా స్టార్లపై కన్నేసింది. ఇందులో భాగంగానే మోషుమీ ఛటర్జీని బీజేపీలోకి తీసుకొచ్చింది. అయితే సినిమా రంగానికి చెందిన వ్యక్తులను పార్టీలోకి తీసుకురావడం బీజేపీకి ఇది కొత్తేమీ కాదు. 2015లో టీవీ సీరియల్ మహాభారతంలో ద్రౌపది వేశం వేసిన రైపా గంగూలీని పార్టీలోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత సింగర్ బాబుల్ సుప్రియోను నిలబెట్టి ఎంపీగా గెలిపించుకుంది.
ఇప్పటికే పార్లమెంటులో బీజేపీ నుంచి పలువురు సినీ ప్రముఖులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిలో నటి కిరన్ ఖేర్ చంఢీగఢ్ ఎంపీగా సేవలందిస్తుండగా... పాట్నా సాహిబ్ నుంచి నిన్నటి తరం హీరో శతృఘ్నసిన్హా ఎంపీగా ఉన్నారు. ఇక మథురా ఎంపీగా హేమా మాలిని ఉండగా.. భోజ్పూరి గాయకుడు మరియు నటుడు మనోజ్ తివారి ఢిల్లీ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అహ్మదాబాదు ఈస్ట్ ఎంపీగా సుపరిచిత నటుడు పరేష్ రావల్ ఉన్నారు.