జమ్ము కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతున్న కమలనాథులు
జమ్ము కశ్మీర్లో కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి రానున్నాయా...? ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన బీజేపీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు ముందుకు వేస్తోందా...? అమరనాథ్ యాత్ర తర్వాత ఎలాంటి ప్రకటన ఉండబోతోంది.... అనే ప్రశ్నలు జమ్ముకశ్మీర్లో హాట టాపిక్గా మారాయి. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి అక్కడ గవర్నర్ పాలన నడుస్తోంది. ఈ క్రమంలోనే తిరిగి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కమలనాథులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకోసం పెద్ద స్కెచ్ గీస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా అమరనాథ్ యాత్ర ముగిసిన తర్వాత బీజేపీ నుంచి ఓ స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశముంది.
ప్రస్తుతం కమలనాథులు పీడీపీలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలపై కన్నేశారు. ముఫ్తీ పై ఎవరైతో అసహనంతో ఉన్నారో వారిని తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పీడీపీలోని చాలామంది నేతలు ముఫ్తీపై పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు పీడీపీ పార్టీ ఓ కుటుంబ పార్టీలా తయారైందనే బహిరంగ వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఇదే అదనుగా తీసుకుంది కమలం పార్టీ. ఆలస్యం చేసిన ఆశాభంగం అన్న రీతిలో వెంటనే రంగంలోకి దిగి రెబల్ ఎమ్మెల్యేలకు గాళం వేసే పనిలో పడింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న పీడీపీ సీనియర్ నేత రజా అన్సారీతో చర్చలు ప్రారంభించింది.
ఇప్పటికే రజా ముఫ్తీని, పీడీపీ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ ఎన్సీలు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రానందున ఆయన ఏ పార్టీ అయితే ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉందో వారితో కలిసేందుకు సమ్మతమే అని తెలిపారు. సరిగ్గా ఈ పాయింట్నే క్యాష్ చేసుకుంది బీజేపీ. కేవలం ముఫ్తీ అసమర్ధతతోనే ప్రభుత్వం కుప్పకూలిందని బహిరంగ స్టేట్మెంట్ చేశారు అన్సారీ. అంతేకాదు ప్రభుత్వ కార్యక్రమాల్లో , పార్టీ కార్యక్రమాల్లో ముఫ్తీ తన కుటుంబీకులను, బంధువులను కలగజేసుకునేలా చేస్తోందని అన్సారీ బాహాటంగానే విమర్శిస్తున్నారు. ప్రతి చిన్నా చితకా నాయకుడు పార్టీ నిర్మాణం కోసం కష్టపడ్డారని కానీ ముఫ్తీ మాత్రం తన బంధువులకే ప్రాధాన్యత ఇస్తున్నారని అన్సారీ వాపోయారు.
89 అసెంబ్లీ సీట్లున్న జమ్ముకశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య 44. ఇందులో బీజేపీకి 25, పీడీపీకి 28 ఉండగా... కాంగ్రెస్కు 12, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి 15 సీట్లున్నాయి. అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే వారికి ఇంకా 19 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ క్రమంలోనే బీజేపీ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ పీపుల్స్ రెండు సీట్లున్న కాన్ఫరెన్స్ పార్టీ అధినేత సజ్జద్ లోన్ను కలిసి చర్చలు జరిపారు. ప్రస్తుతం తెరవెనుక ఇలాంటి చర్చలు లాబీయింగ్లు చాలానే జరుగుతున్నట్లుగా సమాచారం. అయితే సెప్టెంబర్లో అమరనాథ్ యాత్ర పూర్తయ్యాక ఎలాంటి ప్రకటనైనా రావొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.