ఇంట్రెస్టింగ్: అమేథీ ఖాతాలో పడింది.. రాయ్బరేలీ కోసం కమలం పార్టీ స్కెచ్ ఏంటి..?
ఉత్తర్ ప్రదేశ్లోని అమేథీ.. కాంగ్రెస్కు కంచుకోట. కాదు కాదు ఇది ఒకప్పుడు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అమేథీలో కమలం వికసించింది. అమేథీని ఎలాగైనా గెలవాలని భావించిన బీజేపీ... పక్కా ప్రణాళికతో పావులు కదిపింది. అనుకున్న లక్ష్యాన్ని అందుకుంది. ఇప్పుడు మరో టాస్క్ బీజేపీపై ఉంది. మరో కాంగ్రెస్ కంచుకోట రాయ్బరేలీని కూడా బద్దలు కొట్టాలని భావిస్తోంది. మరి సోనియాగాంధీ ప్రాతినిథ్యం వహించే రాయ్బరేలీ లోక్సభ స్థానంను కైవసం చేసుకునేందుకు ఎలాంటి స్కెచ్ వేస్తున్నారు కమలనాథులు..? తెలుసుకోవాలంటే లెట్స్ రీడ్ దిస్ స్టోరీ.
రాయ్బరేలీపై కన్నేసిన కమలనాథులు
కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అమేథీని గెలిచి సత్తా చాటిన బీజేపీ తాజాగా రాయ్బరేలీపై కూడా కన్నేసింది. ఇక రాయ్బరేలీకి అభివృద్ధి పరంగా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తలుస్తోంది కమలం పార్టీ. అందుకే రాయ్బరేలీకి కొన్ని భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు తీసుకువచ్చేందుకు పావులు కదుపుతోంది. రాహుల్ గాంధీని ఎలాగైతే అమేథీలో ఓడించారో అలానే రాయ్బరేలీలో కూడా సోనియా గాంధీని ఓడించాలనే కృత నిశ్చయంతో బీజేపీ ఉంది. అమేథీలో రాహుల్పై స్మృతీ ఇరానీ ఓటమి పాలైనప్పటికీ అక్కడ ఆమెపై ఎలాంటి ఒత్తిళ్లు తీసుకురాకుండా ఫ్రీహ్యాండ్ ఇచ్చింది బీజేపీ. దీంతో స్మృతీ ఇరానీ తన సొంత నిర్ణయాలు తీసుకుని అక్కడ పార్టీ కేడర్ను బలోపేతం చేసుకుని రాహుల్పై గెలవగలిగింది. ఇక సోనియాగాంధీపై పోటీచేసిన బీజేపీ నేత దినేష్ ప్రతాప్ సింగ్కు కూడా ఇదే తరహా ఫార్ములా ఇంప్లిమెంట్ చేయాలని బీజేపీ కోరుతోంది.
రాయ్బరేలీకి పలు భారీ ప్రాజెక్టులు
ఇక రాష్ట్రంలోని యోగీ ఆదిత్యనాథ్ సర్కార్.. కేంద్రంలోని మోడీ సర్కార్లు రాయ్బరేలీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే రాయ్బరేలీలో ఎయిమ్స్ నిర్మాణం, రాయ్బరేలీ మీదుగా గంగా ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం మరియు 2019 నాటికి రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేస్తే రాయ్బరేలీ బీజేపీ ఖాతాలో పడుతుందని భావిస్తోంది. 2016లో స్మార్ట్ సిటీ జాబితాలో చోటు దక్కించుకోవడంలో విఫలమైన రాయ్బరేలీ ఈసారి జాబితాలో చోటు దక్కేలా ప్రాధాన్యత చూపిస్తున్నట్లు సమాచారం. ఇక రోడ్డు విస్తరణ పనులు ఇప్పటికే జరిగాయి. హైవే నిర్మాణం కూడా బీజేపీ సర్కార్ కిందే పూర్తయింది. ఈ మధ్యే ఐదు భారీ ప్రాజెక్టులు పెట్టేందుకు పలు ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదిరింది. అంతేకాదు మింట్పై పరిశోధన చేసేందుకు స్పైస్ పార్క్ను కూడా రాయ్బరేలీలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఎయిమ్స్ నిర్మాణం కోసం యోగీ సర్కార్ ఆమోదం
మంగళవారం రోజున రాష్ట్ర కేబినెట్ ఎయిమ్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఆమోదం తెలిపిన వెంటనే నిర్మాణం చేయదలచిన స్థలంలో పాత భవనాలను నేలమట్టం చేసింది యోగీ సర్కార్. 2020 నాటికి ఎయిమ్స్ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని విధించుకుంది ప్రభుత్వం. ఎయిమ్స్ ప్రాజెక్టు 2009లో నాటి కాంగ్రెస్ హయాంలో రూ.823 కోట్లతో నిర్మించాలని నిర్ణయం జరిగిందని అయితే పదేళ్లు దాటినా పనులు ప్రారంభం కాలేదు. ఇక యోగీ ప్రభుత్వం రాగానే దీనిపై దృష్టి సారించింది. రాయ్బరేలీలో వచ్చే ఏడాదికల్లా ఎయిమ్స్ పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఎంప్లాయిమెంట్పై దృష్టి సారించిన మోడీ సర్కార్
గతేడాది డిసెంబర్లో ప్రధాని నరేంద్ర మోడీ ఉపాధి కల్పన కోసం రైలు కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని భావించారు. ఈ నియోజకవర్గంలోని మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీలో 900వ కోచ్ ఆవిష్కరణ సందర్భంగా మోడీ ఇక్కడ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై హామీ ఇచ్చారు. ఇక రైలు కోచ్ ఫ్యాక్టరీ కూడా రాయ్బరేలీలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన 2009లో కాంగ్రెస్ హయాంలోనే చేయడం జరిగింది. ఆ సమయంలో రాష్ట్రంలో బీఎస్పీ ప్రభుత్వం ఉండేది. అయితే బీజేపీ హయాంలోకి వచ్చాకే కోచ్లు తయారుకావడం మొదలయ్యాయని మోడీ క్రెడిట్ తీసుకున్నారు. ఈప్రాజెక్టులు పూర్తయితే కచ్చితంగా యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని బీజేపీ భావిస్తోంది. ఇక రాయ్ బరేలీలో ఇతర ప్రభుత్వ పథకాలు అయిన సౌభాగ్య, ఉజ్వల, స్వచ్చ భారత్లాంటి కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేసి విద్యుత్, ఎల్పీజీ, మరియు టాయ్లెట్ నిర్మాణాలు చేపట్టాలని భావిస్తోంది.
మొత్తానికి ఇన్ని ప్రాజెక్టులు ఒక్క రాయ్బరేలీకే తీసుకురావడం వెనక రహస్యమేమీ లేదని కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆసీటును కూడా బీజేపీ కైవసం చేయాలనేది స్పష్టంగా తెలుస్తోంది. అయితే గాంధీ కుటుంబాన్ని రాయ్బరేలీ ప్రజలు ఇంకా ఆదరిస్తారా లేక బీజేపీ అభివృద్ధి మంత్రాకే ఓటేస్తారా తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు వేచిచూడాల్సిందే.