రైతుల ఆగ్రహంతో బీజేపీకి చుక్కలు - హర్యానా, రాజస్తాన్లో మిత్రపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోళనలకు దేశవ్యాప్తంగా పెరుగుతున్న మద్దతు బీజేపీకి మంట పుట్టిస్తోంది. రైతుల ఆందోళనలకు మద్దతుగా వివిధ రాష్ట్రాల్లో బీజేపీకి మిత్రపక్షాలుగా ఉన్న వారి నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో బీజేపీకి ఏం చేయాలో పాలుపోని పరిస్ధితి. రైతులను ఒప్పించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతుండటం ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి చుక్కలు చూపిస్తోంది.
కేంద్రం తీసుకొచ్చిన కార్పోరేట్ వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన నానాటికీ తీవ్రమవుతోంది. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన రైతులు ఇప్పటికే ఢిల్లీ శివార్లలో మోహరించారు. వారిని ఢిల్లీలో అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే వీరికి వివిధ రాష్ట్రాల్లో అన్నదాతలు,సాధారణ ప్రజల నుంచ పెరుగుతున్న మద్దతు కేంద్రంలోని బీజేపీపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. రైతులతో ఇవాళ చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.
మరోవైపు రైతుల ఆందోళనల ప్రభావం హర్యానా, రాజస్దాన్లోని బీజేపీ మిత్రపక్షాలపైనా పడింది. హర్యానాలో బీజేపీకి మద్దతిస్తున్న వారితో పాటు రాజస్దాన్లోనూ ఆ పార్టీ మిత్రపక్షాలూ రైతుల ఆందోళనలకు మద్దతిస్తున్నాయి. దీంతో బీజేపీపై ఆ మేరకు ఒత్తిడి పెరుగుతోంది. హర్యానాలో బీజేపీ-జేజేపీ ప్రభుత్వానికి మద్దతిస్తున్న దాద్రీ స్ధానంలో స్వతంత్ర ఎమ్మెల్యే సోంబిర్ సింగ్ సాంగ్వాన్ రైతుల ఆందోళనలో పాల్గొనాలని నిర్ణయించారు. అదే సమయంలో హర్యానా పశుధన్ బోర్డు ఛైర్మన్ పదవికీ ఆయన రాజీనామా చేశారు. అలాగే రాజస్దాన్లో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రీయ లోక్తంత్ర్ పార్టీ ఎమ్మెల్యే హనుమాన్ బనివాల్ కూడా కేంద్రం తన నిర్ణయాన్ని పునర్ సమీక్షించకపోతే ఎన్డీయే నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు.