రాహుల్ పై సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలంటున్న మీనాక్షి లేఖి...ఎందుకు..?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ధిక్కారణ చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి. రాఫెల్ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు తీర్పును కించపరిచేలా ఉన్నాయని చెప్పిన మీనాక్షి రాహుల్ పై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. కేసును విచారణ చేసేందుకు అంగీకరించిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఏప్రిల్ 15న వాదనలు వింటామని చెప్పారు.
రాఫెల్ అంశంలో సుప్రీంకోర్టు కూడా చౌకీదార్ చోర్ అని వ్యాఖ్యానించిందంటూ రాహుల్ గాంధీ చెప్పారు. సుప్రీంకోర్టు మోడీ ప్రస్తావనే తీసుకురానప్పుడు రాహుల్ ఎలా ఆ వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు అనుసంధానిస్తారని మీనాక్షి లేఖి తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీ ప్రశ్నించారు.
రాఫెల్లో అవకతవకలు జరిగాయని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ కేంద్రమాజీ మంత్రులు అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హా, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్లు రివ్యూపిటిషన్లు దాఖలు చేశారు. వీరి పిటిషన్లకు పలు డాక్యుమెంట్లను కూడా అటాచ్ చేశారు. అయితే వీటిని విచారణ చేయకూడదంటూ రక్షణశాఖ మరో పిటిషన్ దాఖలు చేసింది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆ డాక్యుమెంట్లను బహిర్గతం చేయరాదంటూ అఫిడవిట్లో రక్షణ శాఖ పేర్కొంది. అయితే రక్షణశాఖ అఫిడవిట్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు అన్ని రివ్యూపిటిషన్లను విచారణ చేస్తామని స్పష్టం చేసింది. రాఫెల్ విషయంలో లీకైన డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తామని ఏకగ్రీవ తీర్పును న్యాయస్థానం ఇచ్చింది.