జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాలపై బీజేపీలో టెన్షన్.. జేవీఎం చీఫ్ మరాండీతో మంతనాలు
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష జేఎంఎం-కాంగ్రెస్ కూటమి మధ్య హోరాహోరీ పోరు నడుస్తున్నది. ట్రెండ్స్ వెలువడటం మొదలైన దగ్గర్నుంచే.. ఫలితాలు హంగ్ దిశగా వెళుతుండటంతో అన్ని పార్టీల్లో గుబులు మొదలైంది. అధికారం చేపట్టబోయేది ఎవరైనప్పటికీ.. మార్జిన్ చాలా స్వల్పంగా ఉంటుందనేది తేలడంతో ఆయా పార్టీలు ప్లాన్ బీ అమలుకు రెడీ అయ్యాయి. ముఖ్యంగా బీజేపీ... తన పాతమిత్రుల్ని దగ్గరికి తీసుకునే పనిలో పడింది. అందులో భాగంగా జార్ఖండ్ వికాస్ మోర్చా(జేవీఎం) చీఫ్ బాబూలాల్ మరాండీతో మంతనాలు ప్రారంభించినట్లు తెలుస్తున్నది.
ఎవరెవరికి ఎన్ని సీట్లు..
మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్ లో ప్రస్తుతానికి వెలువడిన ఫలితాల ప్రకారం 30 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) 22 సీట్లలో, కాంగ్రెస్ 13 సీట్లలో దూసుకుపోతుండగా, వారి మిత్రపార్టీ ఆర్జేడీ 5 స్థానాల్లో లీడ్ లో ఉంది. కూటమిగా కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ సత్తాచాటుకుంటుండటంతో బీజేపీ.. జేవీఎం చీఫ్ తో చర్చలు మొదలుపెట్టింది. ప్రస్తుతం జేవీఎం నాలుగు స్థానాల్లో లీడ్ లో ఉంది. మరో కీలక పార్టీ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ రెండు స్థానాల్లో ముందంజలో ఉంది.
హైకమాండ్ ఆదేశాలతో..
సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ.. అధికారం కోసం కావాల్సిన బలాన్ని జేవీఎం, ఏజేఎస్ యూ మద్దతుతో కూడగట్టాలని ప్రయత్నిస్తున్నది. ఢిల్లీలోని బీజేపీ హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జార్ఖండ్ బీజేపీ నేతలు జేవీఎం చీఫ్ మరాండీతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. మరాండీ ఒకప్పుడు బీజేపీ నేతే కావడంతో రెండు పార్టీల మధ్య చర్చలకు సానుకూలత ఏర్పడింది. అయితే చర్చలు ప్రస్తుతానికి ప్రాధమిక దశలో ఉన్నాయని, ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే మిగతా విషయాలు చెబుతామని పార్టీల నేతలు అంటున్నారు.
మ్యాజిక్ ఫిగర్ 41
జార్ఖండ్ లో అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను సాధిస్తామా లేదా అన్న టెన్షన్ అన్ని పార్టీల్లో ఉంది. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తోన్నది కాబట్టే బీజేపీ.. చిన్న పార్టీల నేతలతో చకచకా మంతనాలు చేస్తున్నది. ఇంకొద్ది సేపట్లో అన్ని విషయాలపై పూర్తిక్లారిటీ వచ్చే అవకాశముంది.