బీజేపీకి విరాళాలు ఇచ్చింది ఉగ్రసంస్థతో సంబంధం ఉన్న కంపెనీ: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఉగ్రకార్యకలాపాలకు నిధులు సమకూర్చే సంస్థ నుంచి బీజేపీకి విరాళాలు అందాయని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. మీడియాలో వచ్చిన కథనాలను బేస్ చేసుకుని బీజేపీపై కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడైన ఇక్బాల్ మీమన్ అలియాస్ ఇక్బాల్ మిర్చి నుంచి బీజేపీకి విరాళాలు ఇచ్చిన సంస్థ ఆస్తులు కొనుగోలు చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇక్బాల్ మిర్చి నుంచి ఆ సంస్థ ఆస్తులు ఎందుకు కొనుగోలు చేసిందని కాంగ్రెస్ ప్రశ్నించింది. అంతేకాదు ఆ సంస్థ ఈడీ నిఘాలో ఉందని వెల్లడించింది.
బీజేపీ దెబ్బకు ఆ రోజు మాజీ ప్రధాని దేవేగౌడ, ఈ రోజు శరద్ పవార్: బకరా అయ్యింది మాత్రం?
పార్టీల విరాళాల కోసం ఎలక్టోరాల్ బాండ్లను ప్రవేశపెడుతున్నట్లు చెప్పి బహిరంగంగానే అవినీతికి తెరలేపిన బీజేపీ ఇప్పుడు ఉగ్రసంస్థలకు నిధులు చేకూర్చే సంస్థల నుంచి కూడా విరాళాలు పొందుతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ 2014-15లో బీజేపీకి రూ.10 కోట్లు విరాళం ఇచ్చినట్లు ఓ జాతీయ ఛానెల్ కథనంను ప్రసారం చేసింది.
ఉగ్రకార్యకలాపాలకు నిధులు సమకూరుస్తూ ఈడీ నిఘాలో ఉన్న సంస్థ నుంచి బీజేపీ విరాళాలు ఎలా తీసుకుందో ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీ అమిత్ షాలను డిమాండ్ చేసింది. బాండ్ల రూపంలో అవినీతి ప్రారంభించిన మోడీ ఇప్పుడు ఉగ్రసంస్థలకు కూడా నిధులు సమకూరుస్తున్న కంపెనీల నుంచి విరాళాలు సేకరిస్తున్నాని ధ్వజమెత్తారు రణదీప్ సూర్జేవాలా. అంతేకాదు దావూద్ ఇబ్రహీం సన్నిహితుడైన ఇక్బాల్ మిర్చికి మరో మూడు సంస్థలతో సంబంధాలున్నాయని ఆరోపించిన కాంగ్రెస్ .. బీజేపీ ఈ మూడు సంస్థల నుంచి విరాళాల పేరుతో ఎలక్టోరాల్ బాండ్లను స్వీకరించిందని ధ్వజమెత్తింది.
Links to Iqbal Mirchi, terror funding companies & a litany of organisation being investigated by the Enforcement Directorate, the BJP's Electoral Bond Scandal may have crossed over from Corruption to Treason. #ModiBondOfCorruptionhttps://t.co/38ves0exmN
— Congress (@INCIndia) November 22, 2019
కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించేందుకు బీజేపీ నిరాకరించింది.ఇదిలా ఉంటే ఇక్బాల్ మిర్చి అనే వ్యక్తి దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడు. కుడిభుజంగా వ్యవహరించేవాడు. 1993 ముంబై పేలుళ్లలో నిందితుడిగా ఉన్నాడు. యూకేలో 2013 ఆగష్టులో మృతిచెందాడు. అప్పటికీ ఆయన వయస్సు 63 ఏళ్లు. అంతేకాదు ఇక్బాల్ మిర్చి ప్రపంచంలో డ్రగ్ పెడ్లర్లలో ఉన్నా టాప్ డ్రగ్ పెడ్లర్లలో ఒకరుగా ఉన్నాడు. డ్రగ్స్ వ్యాపారం తర్వాత క్రికెట్ బెట్టింగ్ల వైపు తన దృష్టిని మరల్చాడు ఇక్బాల్ మిర్చి.