ఢిల్లీ జల్ బోర్డుపై దాడి.. బీజేపీ గూండాల పనే అన్న ఆప్.. రైతులకు మద్దతునిస్తున్నందుకే..?
దేశ రాజధాని ఢిల్లీలోని జల్ బోర్డ్ కార్యాలయంపై దాడి జరిగింది. బీజేపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే,ఢిల్లీ జల్ బోర్డు వైస్ ఛైర్మన్ రాఘవ్ చద్దా ఆరోపించారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రైతుల పక్షాన నిలవడాన్ని వ్యతిరేకిస్తూ ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. రైతుల పక్షాన ఇలాగే మద్దతును కొనసాగిస్తే ప్రతీ ఆప్ ఎమ్మెల్యేకు ఇదే గతి పడుతుందని దాడికి పాల్పడినవారు హెచ్చరించినట్లుగా చెప్పారు.
అంతేకాదు,పోలీసుల సహాయంతోనే బీజేపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారని... సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందని అన్నారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షకుల్లా నిలబడిపోయారని... ఫుటేజీలో అది స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. గురువారం ఉదయం నుంచి ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా నేత్రుత్వంలో బీజేపీ కార్యకర్తలు జల్ బోర్డు ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారని ఆమ్ ఆద్మీ పేర్కొంది. ఈ క్రమంలోనే దాడికి పాల్పడినట్లు తెలిపింది.
ఈ దాడి జరిగిన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'ఇలాంటి పిరికి దాడులకు మేము భయపడం. తమను రెచ్చగొట్టేందుకు బీజేపీ చేస్తున్న ఈ దాడుల పట్ల ఆమ్ ఆద్మీ కార్యకర్తలు సంయమనం పాటించాలి. రైతులకు పూర్తి మద్దతుగా నిలవాలి.తుది శ్వాస వరకు మేము,మా పార్టీ,ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా నిలబడుతాం.' అని కేజ్రీవాల్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
మరోవైపు ఆమ్ ఆద్మీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఆ పార్టీ కార్యకర్తలే దాడికి పాల్పడి బీజేపీపై నిందలు వేస్తున్నారని ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించి 30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా,దాదాపు నెల రోజులుగా సాగుతున్న రైతు ఉద్యమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మొదటి నుంచి మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. కొత్త వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. కేజ్రీవాల్ ఇలా రైతుల పక్షాన నిలబడటం గిట్టని బీజేపీ దాడులకు తెగబడుతోందని ఆమ్ ఆద్మీ ఆరోపిస్తోంది.