ఓట్లకోసమే తెరపైకి సర్జికల్ స్ట్రైక్స్ వీడియోలు: కాంగ్రెస్
ఏడాదినర్ర క్రితం అంటే 2016లో పాకిస్తాన్పై జరిగిన సర్జికల్ స్ట్రైక్స్కు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో,పలు టీవీ ఛానెళ్లలో ప్రసారం అవడంతో కాంగ్రెస్ బీజేపీల మధ్య దుమారానికి దారి తీసింది. ఈ వీడియోలను బీజేపీ విడుదల చేసిందని తద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు.
సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన ఏడాదినర్రకు వీడియోలు దర్శనమివ్వడంపై కాంగ్రెస్ మండిపడింది. ఉగ్రవాదులకు సంబంధించిన లాంచ్ ప్యాడ్లను భారత కమాండోలు ధ్వంసం చేస్తున్నప్పటి దృశ్యాలు కలిగిన వీడియోను పలు టీవీ ఛానెళ్లు ప్రసారం చేశాయి. అంతేకాదు పాక్ గడ్డపై ఉగ్రవాదులను మట్టుబెట్టడం, వారి బంకర్లను ధ్వంసం చేయడం వంటివి డ్రోన్ల సహాయంతో చిత్రీకరించారు.
భారత జవాన్లు చేసిన ఈ సాహసాన్ని చూపి ఓట్లు పిండుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. జవాన్ల త్యాగాన్ని ఓట్ల కోసం వాడుకోరాదని కాంగ్రెస్ సూచించింది. జవాన్లు ప్రాణ త్యాగం చేస్తే... మోడీ ఆ క్రెడిట్ను తీసుకోవడం సరికాదన్నారు. జై జవాన్..జై కిసాన్ నినాదాన్ని మోడీ దుర్వినియోగిస్తున్నారని కాంగ్రెస్ దుయ్యబట్టింది. వాజ్పాయి హయాంలోకాని, మన్మోహన్ సింగ్ హయాంలో కానీ పాకిస్తాన్పై విజయం సాధిస్తే వారు తమ ప్రభుత్వం గొప్పతనమని ఏ రోజైనా చెప్పుకున్నారా అని దేశం ప్రశ్నిస్తోందని సూటిగా అడిగింది కాంగ్రెస్.