నాకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ గోవధకు పాల్పడింది: కేంద్రమంత్రి
చండీగఢ్: తనకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ గోవధకు పాల్పడిందని ధ్వజమెత్తారు కేంద్రమంత్రి విజయ్ సంప్ల. పంజాబ్లోని హోషియాపూర్ నియోజకవర్గం నుంచి సంప్ల టికెట్ ఆశించారు. సంప్ల ఆశలపై నీళ్లు చల్లుతూ హోషియాపూర్ నియోజకవర్గం టికెట్ను ఫగ్వారా ఎమ్మెల్యే సోమ్ప్రకాష్కు కేటాయించింది. దీంతో ట్విటర్పై సంప్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా బాధగా ఉందని చెప్పిన సంప్ల తనకు టికెట్ ఇవ్వకుండా కమలం పార్టీ గోవధకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
बहुत दुख हुआ भाजपा ने गऊ हत्या कर दी।
— Vijay Sampla (@vijaysamplabjp) April 23, 2019
తాను పార్టీకి చేసిన ద్రోహం ఏమిటో చెప్పాలని విజయ్ సంప్ల మరో ట్వీట్ చేశారు. తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించినట్లు చెప్పిన ఈ దళిత మంత్రి... అయినప్పటికీ బీజేపీ ఎందుకు టికెట్ కేటాయించలేదో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. టికెట్ ఇవ్వడం లేదని ఒక్క మాట తనతో చెప్పి... ఎందుకు ఇవ్వడంలేదో కూడా కారణం వివరించి ఉంటే బాగుండేదని ఆయన ట్విటర్లో రాసుకొచ్చారు. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, తన ప్రవర్తనపై ఎవరూ వేలెత్తి చూపలేరని చెప్పారు.
ఒక ఎంపీగా తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రస్తావించారు విజయ్ సంప్లా. తన ప్రాంతానికి ఒక ఎయిర్పోర్టు తీసుకువచ్చినట్లు చెప్పిన సంప్లా.... తన నియోజకవర్గానికి పలు రైళ్లు తీసుకురావడంతో పాటు కొత్త రహదారులను కూడా నిర్మించినట్లు చెప్పారు. ఇదేతాను చేసిన నేరమైతే మళ్లీ బీజేపీకి ఓటు వేసి తప్పు చేయొద్దని భవిష్యత్ తరాలకు చెబుతానని అన్నారు సంప్లా. అంతేకాదు ట్విటర్ ఖాతకు తన పేరుకు ముందు ఉన్న చౌకీదార్ అనేదాన్ని కూడా తొలగించారు సంప్లా. ప్రస్తుతం విజయ్ సంప్లా సామాజిక న్యాయం సాధికారిత శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు పంజాబ్ బీజేపీ చీఫ్గా విజయ్ సంప్లాను అధిష్టానం నియమించింది. అప్పటి వరకు పంజాబ్ చీఫ్గా ఉన్న రాజ్యసభ ఎంపీ శ్వైత్ మాలిక్ను తొలగించింది. అయితే విజయ్ సంప్లాకు శ్వైత్ మాలిక్కు మంచి సంబంధాలు లేవని తెలుస్తోంది.