కేంద్ర మంత్రి VS ఐపీఎస్ అధికారి, బంద్, సరిహద్దుల్లో ఉద్రిక్తత, ఇదేనా మీ మర్యాద, బస్సులు!
కన్యాకుమారి: తమిళనాడు-కేరళ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ఇరు రాష్ట్రాల పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో బంద్ నిర్వహించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పట్ల కేరళ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని తమిళనాడు బీజేపీ నాయకులు ఆరోపించారు. కేరళ వచ్చిన కేంద్ర మంత్రికి మీరు ఇచ్చే మర్యాద ఇదేనా అంటు కేరళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పట్ల కేరళ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ గురువారం కన్యాకుమారి జిల్లా బంద్ కు బీజేపీ నాయకులు పిలిపునిచ్చారు. ఈ సందర్బంలో కేరళ ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన బస్సుల మీద దాడి జరిగింది.
కేరళ బస్సుల మీద దాడి జరగడంతో, సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో తమిళనాడు- కేరళ అంతరాష్ట్ర బస్సు సర్వీసులు పూర్తిగా నిలిపివేశారు. కన్యాకుమారిలో తమిళనాడు ఆర్ టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. కన్యాకుమారి జిల్లాలో పోలీసులు బలగాలు భారీగా మొహరించాయి.
కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ బుధవారం పంపాకు ప్రైవేటు వాహనంలో వెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో కేరళ పోలీసులు అడ్డుకున్నారు. కేరళ ఆర్ టీసీ బస్సులోనే వెళ్లాలని కేరళ పోలీసులు ఆయనకు సూచించారు. చివరికి కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ కేరళ అర్ టీసీ బస్సులోని పంపాకు వెళ్లారు.
కన్యాకుమారి జిల్లాలో కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ కు మంచి పట్టు ఉంది. ఇరుముడితో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్లిన కేంద్ర మంత్రి పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేరళ పోలీసులు వెంటనే క్షమాపణ చెప్పాలని తమిళనాడు బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి పట్ల కేరళ పోలీసులు వ్యవహరించిన తీరు గమనిస్తే ఇక సామాన్యుల పట్ల ఎలా ప్రవర్థిస్తారో అర్థం అవుతోందని బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.