రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, కేసీఆర్ 'థర్డ్ ఫ్రంట్' లాగే మేమూ..: ఎస్పీ నేత
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏళ్లుగా ఎస్పీ-బీఎస్పీల మధ్య కొనసాగుతూ వస్తున్న వైరానికి తాజా ఉపఎన్నికలతో తెరపడుతున్నట్టే కనిపిస్తోంది.
గోరఖ్ పూర్, ఫల్పూర్ లోక్ సభ ఉపఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎస్పీకి బహిరంగ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ ఉమ్మడి శత్రువు బీజేపీని దెబ్బకొట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె ప్రకటించారు.
బీజేపీకి ఎస్పీ కౌంటర్:
ఈ నేపథ్యంలో ఎస్పీ, బీఎస్పీలపై విమర్శలు మొదలయ్యాయి. రాజకీయాల కోసం ఏమైనా చేస్తారంటూ బీజేపీ ఆరోపిస్తోంది. దీంతో ఎస్పీ బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని.. అసలు దీనిపై మాట్లాడటానికి బీజేపీకి నైతిక హక్కు లేదని స్పష్టం చేసింది.
రాజకీయ అనివార్యత:
ఎస్పీ జాతీయ ఉపాధ్యక్షురాలు కిరణ్మయ్ నందా ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. బీఎస్పీతో తమ పార్టీ అవగాహనను రాజకీయ అనివార్యతగా పేర్కొన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్కు భయం పట్టుకుందని, అందుకే తమను పాము, ముంగీసలుగా అభివర్ణిస్తున్నారని అన్నారు.
ఒకప్పుడు పాశ్వాన్ మీ శత్రువు కాదా?
తమ రెండు పార్టీల మధ్య అవగాహన ఏ మాత్రం ప్రభావం చూపించదని అంటూనే.. బీజేపీ తమను ఎందుకు టార్గెట్ చేస్తుందన్నారు. అదే సమయంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలను గుర్తుచేశారు.
'ఒకప్పుడు రామ్ విలాస్ పాశ్వాన్ బీజేపీకి బద్ధశత్రువు. కానీ బిహార్లో బీజేపీ ఆయనతో ఎలా పొత్తు పెట్టుకుంది?. అలాగే బిహార్లో నితీష్ కుమార్తో పరిస్థితి ఏమైంది?. అంటూ ప్రశ్నించారు. అదే సమయంలో కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కూడా గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
కేసీఆర్ 'థర్డ్ ఫ్రంట్' పెట్టట్లేదా.. ఇదీ అంతే!
'ఒకప్పుడు ఎన్డీఏతో సఖ్యతగా ఉన్న కె.చంద్రశేఖర్ రావు ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారు కదా?.. కాబట్టి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు అంటూ ఉండరు. రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు జరుగుతాయి.' అని కిరణ్మయి నందా స్పష్టం చేశారు.
ఉపఎన్నికల్లో ఎస్పీకి పెరుగుతున్న మద్దతు:
ఇకపోతే ఉపఎన్నికల్లో బీఎస్పీ మద్దతకు అఖిలేశ్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. మొత్తం 12పార్టీలు తమకు మద్దతునిస్తున్నాయన్నారు.
కాగా, వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో తిరిగి ఎస్పీ మద్దతు పొందేందుకే మాయావతి ఎస్పీకి మద్దతునిచ్చినట్టు తెలుస్తోంది. బీఎస్పీకి ఉన్న సీట్లతో రాజ్యసభలోకి ఎంట్రీ కష్టం కాబట్టి మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.