గాలి జనార్దన్ రెడ్డితో సంబంధం తెగిపోయింది, కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కటే, రుణమాఫి: బీజేపీ!
మైసూరు/బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డితో మాకు సంబంధం తెగిపోయిందని బీజేపీ మరోసారి చెప్పింది. గాలి జనార్దన్ రెడ్డిని ప్రచారం చెయ్యాలని తాము ఎప్పుడూ చెప్పలేదని, వ్యక్తిగతంగా స్నేహితుడు శ్రీరాములు కోసం ఆయన ప్రచారం చేసుకుంటున్నారని, అధికారంలోకి వస్తానే రైతుల రుణ మాఫి చేస్తామని కర్ణాటక బీజేపీ శాఖ ఇన్ చార్జ్ మురళీధర్ రావ్ అన్నారు.
రెడ్డితో మాకు సంబంధం లేదు
గాలి జనార్దన్ రెడ్డితో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, ఆయన బీజేపీ నాయకుడు కాదు, కార్యకర్త అసలు కాదని మురళీధర్ రావ్ అన్నారు. స్నేహితుడు బళ్లారి ఎంపీ బి. శ్రీరాములు గెలుపుకోసం గాలి జనార్దన్ రెడ్డి మాళకాల్మూరు, బాదామి నియోజక వర్గాల్లో ప్రచారం చేస్తున్నారని మురళీధర్ రావ్ చెప్పారు.
యడ్యూరప్ప మాట నిజం కాదు
బీజేపీ తరపున గాలి జనార్దన్ రెడ్డి ప్రచారం చెయ్యడానికి మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంగళవారం శివమొగ్గలో బీఎస్. యడ్యూరప్ప చెప్పారని మీడియా ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదని మురళీధర్ రావ్ వివరణ ఇచ్చారు.
రైతుల రుణమాఫి
ప్రధాని నరేంద్ర మోడీకి చామరాజనగరలో ప్రజలు ఘనస్వాగతం పలికారని, ఈ ప్రాంతంలో బీజేపీ తన సత్తా చాటుకుంటుందని మురళీధర్ రావ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, యడ్యూరప్ప అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణమాఫి చేస్తామని మురళీధర్ రావ్ హామీ ఇచ్చారు.
100 బహిరంగ సభలు
ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితీన్ గడ్కరి తదితరులు కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ప్రచారం చేస్తారని మురళీధర్ రావ్ అన్నారు. ఇప్పటికే యడ్యూరప్ప 100కు పైగా బహిరంగ సభలు నిర్వహించారని, ప్రజలు నుంచి మంచి స్పంధన వచ్చిందని, బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తోందని మురళీధర్ రావ్ ధీమా వ్యక్తం చేశారు.
బెంగళూరులో కాంగ్రెస్, జేడీఎస్ దోస్తీ
బీజేపీ, జేడీఎస్ కుమ్మక్కు అయ్యాయని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని మురళీధర్ రావ్ అన్నారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ)లో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి అధికారంలో ఉందని, వారు ఇప్పటికే ఒక్కటి అయ్యారని, జేడీఎస్ కు ఓటు వేస్తే అది కాంగ్రెస్ వేసినట్లేనని మురళీధర్ రావ్ అన్నారు.
రెండు చోట్ల సీఎం ఓటమి
చాముండేశ్వరి నియోజక వర్గంలో ఓడిపోతాననే భయంతో సీఎం సిద్దరామయ్య బాదామి నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారని, రెండు చోట్ల ఆయన ఓడిపోతారని మురళీధర్ రావ్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా ఇంటికి పోతుందని మురళీధర్ రావ్ అన్నారు.
శ్రీరాములు దెబ్బకు సిద్దూ !
బాదామి నియోజక వర్గంలో తాను విజయం సాధిస్తాను అంటూ సీఎం సిద్దరామయ్య పగటికలలు కంటున్నారని, బళ్లారి ఎంపీ బి. శ్రీరాములు అక్కడ గట్టి పోటీ ఇస్తున్నారని మురళీధర్ రావ్ చెప్పారు. శ్రీరాములు దెబ్బకు సీఎం సిద్దరామయ్య కచ్చితంగా ఇంటికి పోతారని మురళీధర్ రావ్ జోస్యం చెప్పారు.